ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండోర్‌ మెట్లబావి ఘటనలో.. పెరుగుతున్న మృతుల సంఖ్య

national |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 08:14 PM

ఇండోర్‌ బేలేశ్వర్‌ మహదేవ్‌ ఝూలేలాల్‌ ఆలయ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. గురువారం మధ్యాహ్నం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు.. 40 అడుగుల లోతున్న మెట్లబావి పైకప్పు కూలి అందులో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 35 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది గాయపడ్డారని ఇండోర్ జిల్లా కలెక్టర్ టి. ఇళయరాజా వెల్లడించారు. ఒకరి ఆచూకీ లభించలేదని, చికిత్స తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. మిస్సైన వ్యక్తి కోసం బావిలో గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.


గురువారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన చెప్పారు. పటేల్‌ నగర్‌ ప్రాంతంలో ఈ పురాతన ఆలయాన్ని ఓ ప్రయివేట్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. రామనవమి ఉత్సవాలకు పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో రద్దీ పెరిగింది. స్థలాభావం కారణంగా వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి కప్పుపై కూర్చున్నారు. దీంతో బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయి ఘోరం జరిగింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెనలు, తాళ్ల సాయంతో కొందరు భక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు.


స్థానికుల ఫిర్యాదులపై ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటే ఈ విషాదం జరిగుండేది కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అటు, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com