అమెరికాలో భారత సంతతికి చెందిన 22 ఏళ్ల ఐటీ నిపుణుడు శుభమ్ గోయల్ కాలిఫోర్నియా గవర్నర్ పదవి కోసం పోటీ పడుతున్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన శుభమ్ మెగాఫోన్ పట్టుకుని కాలిఫోర్నియా వీధుల్లో నిర్వహిస్తున్న ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. ఐటిలో తనకున్న నైపుణ్యాన్ని ఇందుకోసం ఉపయోగించుకుంటున్నాడు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. ''వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తుందనడంలో సందేహం లేదని, కాలిఫోర్నియాలో విద్యాపరమైన సమస్యలను ఇది పరిష్కరిస్తుందని శుభమ్ పేర్కొన్నారు. డెమొక్రటిక్ గవర్నర్ జెర్రీ బ్రౌన్ కంటే తాను మెరుగైన వ్యక్తినని చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. శుభమ్ తల్లి కరుణ గోయల్ మీరట్కు చెందిన వారు కాగా, తండ్రి విపుల్ గోయల్కు లక్నోలో సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. శుభమ్ కాలిఫోర్నియాలో యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో పట్టభద్రుడయ్యాడు. గతేడాది నుండి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.