ప్రధాని నరేంద్రమోదీ అభివృద్ధి అజెండాను ప్రజలు అంగీకరించారని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్లీలోని భాజపా కార్యాలయంలో అమిత్షా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ తీసుకున్న పలు సంస్కరణల గురించి ఆయన ప్రస్తావించారు.
‘కుటుంబ, కుల రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికి.. అభివృద్ధి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒకే ర్యాంకు ఒకే పింఛను(ఓఆర్ఓపీ) సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరించింది. అవినీతిని అడ్డుకునేందుకు ఆయన తీసుకున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఆయన గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు’.
‘అత్యంత కష్టపడి పనిచేసే ప్రధానమంత్రిని భాజపా దేశానికి ఇచ్చింది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఆయన ప్రజాదరణ పొందిన నాయకుడు. రోజుకు 15-18గంటలు పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రధాని భాజపాకు చెందిన వ్యక్తి అయినందుకు ఎంతో గర్విస్తున్నాం’ అని వెల్లడించారు.
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపైనా షా స్పందించారు. ‘యుద్ధాన్ని భాజపా చివరి అవకాశంగా భావిస్తుంది. ఎటువంటి రక్తపాతం జరగకుండా సరిహద్దులు సురక్షితంగా ఉండాలనే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భాజపా హయాంలో ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారు’ అని ఆయన పేర్కొన్నారు. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలపైనా ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం కేవలం కొద్ది రోజులు ఇంధన ధరలు పెరిగిపోతేనే వాళ్లు విసిగిపోతున్నారా? ఇంధన ధరల తగ్గింపు విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి దీర్ఘకాల పరిష్కారం కోసం మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది’ అని షా వెల్లడించారు.