అమరావతి: నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బిందుసేద్యం, తుంపర సేద్యం మరింత పెరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ పాల దిగుబడి 20 శాతం లక్ష్యానికి 16.2 శాతానికి చేరామని పేర్కొన్నారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలపై దృష్టి పెట్టాలని, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆక్వా దిగుబడుల నాణ్యత పెంచాలన్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 30 శాతం వర్షపాతం లోటు ఉన్నా 34 మీటర్ల భూగర్భజలాలు పెంచామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నీరుప్రగతి, జల సంరక్షణ ఉద్యమాలే భూగర్భ జలాల పెంపునకు కారణమన్నారు. ఇబ్బందుల్లోనూ వ్యవసాయంలో 17 శాతం వృద్ధి సాధించామన్నారు. భూసారంలో సూక్ష్మ పోషకాల సమతుల్యత ఉండాలన్నారు. బోరాన్, ఫాస్పరస్ హెచ్చుతగ్గులు లేకుండా చూడాలన్నారు.