అమరావతి: ప్రజల మనోభావాలకు అనుగుణంగా అడగడం బీజేపీకి నచ్చడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయ పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ హోదాకు సమానంగా ఇస్తామంటేనే ఆర్థిక సాయానికి ఒప్పుకున్నామన్నారు. హోదాపై ఆర్థిక సంఘం అభిప్రాయాలను వక్రీకరించారన్నారు. ఈఏపీలకు నిధులిస్తామని చెప్పి కనీసం మెమో కూడా ఇవ్వలేదన్నారు. నాలుగేళ్లయ్యాక, స్పెషల్ పర్పస్ వెహికిల్ అంటున్నారని పేర్కొన్నారు. హోదా లేదని చెప్పి ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిధులు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవన్నీ ఏపీకి కూడా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. తొలి బడ్జెట్లోనే రెక్కలు విరిచి ఎగరమంటే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించానన్నారు. నాలుగేళ్ల క్రితమే కేంద్రాన్ని నిలదీశానన్నారు.