ఏపీ అసెంబ్లి సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లి ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. శాసనసభలో ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త అంగన్వాడీలపై, అల్పాదాయ వర్గాలకు గృహ నిర్మాణం, శిల్పారామాల ఏర్పాటుపై, ఆడ శిశువుకు ఆర్థిక సాయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై ప్రశ్నోత్తరాల్లో చర్చిస్తున్నారు. అలాగే కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన అంశం, రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాల ఏర్పాటుపై, రైతులకు పట్టాల పంపిణీపై, అత్యవసర ప్రజాప్రయోజనాల నోటీసుపై ప్రశ్నోత్తరాల్లో చర్చించనున్నారు. శాసనసభలో ఏకీకృత నీటి పారుదల అభివృద్ధిపై లఘుచర్చ జరగనుంది. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రక్షిత తాగునీరు, స్వాధీనం చేసుకున్న వాహనాలపై, చేనేత కార్మికుల రుణమాఫీ అంశంపై, ఒప్పంద ఉపాధ్యాయులకు సాధారణ సెలవులు, నీరు-చెట్టు కింద నిధుల వ్యయంపై, గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు, హోంగార్డుల నియామకం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే జలవనరుల ప్రాజెక్టులు, గృహ నిర్మాణం, గ్రామీణ నీటి సరఫరాపై మండలిలో లఘు చర్చ జరగనుంది.