ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గత బుధవారం మరణించారు. ఆయనకు తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందని ఒక లేఖ ద్వారా వెల్లడైంది. 17 సంవత్సరాల క్రితం స్టీఫెన్ హాకింగ్ భారత్లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ (ఎన్సీపీఈడీఎల్) డైరెక్టర్ జావేద్ అబిదికి ఒక లేఖ రాశారు. భారత్లో చరిత్రాత్మక ప్రదేశాలైన హుమాయున్ సమాధి, జంతర్ మంతర్, కుతుబ్ మినార్, తాజ్ మహల్ వంటి ప్రదేశాలు చూడాలని ఉందని దానిలో వెల్లడించారు. అవయవ లోపం ఉన్నవారు ఆ పర్యటనను తేలిగ్గా చేసేలా ఏర్పాట్లు చేయమని కోరారు. ఆర్కియాలజికిల్ సర్వే ఆఫ్ ఇండియాకూ అటువంటి లేఖనే పంపారు. కానీ ఆ అధికారులు ‘ఒక్క ఇటుక కూడా మేం కదిలించం. యథాతథ స్థితిలోనే చూడాల్సి ఉంటుంది’ అన్నట్టు వ్యవహరించారు. దాంతో హాకింగ్ కేవలం కుతుబ్ మినార్, జంతర్ మంతర్ మాత్రమే చూడగలిగారు. అక్కడ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ర్యాంప్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయన పర్యటన దేశంలోని ప్రముఖ కట్టడాలు దివ్యాంగులు చూడటానికి అనుకూలంగా మారడానికి కారణం అయ్యాయి. ఈ ఏర్పాట్ల కోసం దివ్యాంగులు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు.