ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా కఠిన నిబంధనలపై తిరగబడ్డ ప్రజలు

international |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 11:34 AM

కఠిన నిర్ణయాలు తీసుకొనే విషయంలో చైనా కూడా ఎపుడూ ముందుంటుంది. కానీ ప్రస్తుతం ఆదేశ లెక్క తప్పింది. కొవిడ్ లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా చైనా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వాయవ్య చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. లాక్‌డౌనే వారి ప్రాణాలు తీసిందని, దానిని తక్షణం ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిన్‌జియాంగ్‌లో అతిపెద్ద నగరమైన ఉరుమ్కిలో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ ప్రజలు పూలు, కొవ్వొత్తులతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. 


ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వీడియోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని, దీని కారణంగా అగ్నిప్రమాదంలో చిక్కుకున్న బాధితులు సకాలంలో తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. 


ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ వీధుల్లోకి చొచ్చుకొచ్చారు. లాక్‌డౌన్ కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందన్న వార్తలను అధికారులు కొట్టిపడేశారు. ప్రమాదం జరిగిన భవనం వద్ద ఎలాంటి బారికేడ్లు లేవని, నివాసితులు బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పుకొచ్చారు. 


జిన్‌జియాంగ్‌లో గత 100 రోజులుగా కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దాదాపు 10 మిలియన్ల మంది ఉయిఘర్లు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక, ఉరుమ్కిలోని నాలుగు మిలియన్లమంది మూడు నెలలకు పైగా ఇళ్లకే పరిమితమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com