బీజేపీకి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తే బీజేపీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ పాదయాత్ర 900 కి.మీ. పూర్తయిన సందర్భంగా సోమవారం (జనవరి 22) ఆయణ్ని జాతీయ మీడియా (సీఎన్ఎన్-ఐబీఎన్) ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. హోదా ఇస్తామన్న హామీ నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా 2019లో బీజేపీతో కలిసి నడవటానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం. చంద్రబాబు అబద్దాలకు రాజు. గడిచిన నాలుగేళ్లలో ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదు. అమరావతికి ఏదో చేస్తున్నామని ప్రపంచమంతా చాటుకున్నారు. కానీ, ఇప్పటివరకు చేసింది శూన్యం. అమరావతి పేరుతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఫూల్స్ చేశారు. అదో పెద్ద భూ కబ్జాల కుంభకోణం’ అని జగన్ అన్నారు.
‘చంద్రబాబు స్థానంలో ఏ గుడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఇంతకంటే మంచిగా పాలన చేయగలరు. ప్రజలను ఎలా మోసం చేయొచ్చో చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఏపీలో జీడీపీ 12 శాతం అని చెబుతారు. జాతీయ వృద్ధి రేటు 5 నుంచి 6 శాతం, ప్రపంచ వృద్ధి రేటు 2 నుంచి 3 శాతం ఉండగా.. ఏపీ జీడీపీ 12 శాతం ఎలా సాధ్యం?’ అని జగన్ విమర్శించారు.
ఏపీ రాజకీయాల్లో జాతీయ పార్టీల ప్రభావం అంతగా లేదని జగన్ చెప్పారు. ‘ఏపీలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పాత్ర ఏమీ ఉండదు. ఈ రాష్ట్రంలో వాటికి పునాదుల్లేవు. మా ప్రధాన లక్ష్యం చంద్రబాబే. నాలుగేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ - బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అయితే.. ఆ పొత్తు క్రమంగా బీటలువారుతోంది. బీజేపీ కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీతో కలవడానికి సిద్ధం’ అని జగన్ అన్నారు.