ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్ సింగ్‌ రణ్‌దవా ఎంపిక

national |  Suryaa Desk  | Published : Sun, Sep 19, 2021, 05:17 PM

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో వివాదరహితుడిగా పేరున్న సుఖ్‌జిందర్ సింగ్‌ రణ్‌దవాను ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పంజాబ్ కొత్త సీఎంగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్‌కు కేంద్ర పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి హరీష్ రావత్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు శనివారం నుంచి ఎమ్మెల్యేలతో సుదీర్ఘ చర్చలు జరిపి కొందరి పేర్లను ప్రతిపాదించడంతో.. కాంగ్రెస్ అధిష్ఠానం వారిలో నుంచి సుఖ్‌జిందర్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.


కాగా, పంజాబ్ కాంగ్రెస్‌లో గత ఐదు నెలలుగా అంతర్గత విభేదాలు తలెత్తాయి. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ పలుమార్లు ఇద్దరినీ పిలిపించి మాట్లాడినా వివాదం సద్దుమణగలేదు. దాంతో కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి హరీష్ రావత్‌కు సూచించింది. దాంతో హరీష్ రావత్ శనివారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ భేటీకి హాజరు కావాలని అదేరోజు ఉదయం ట్వీట్ చేశారు.


ఈ నేపథ్యంలో సీఎల్పీ భేటీ జరుగకముందే కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ హైకమాండ్ తనను అవమానించిందని ఆరోపించారు. సిద్ధూకు పాకిస్థాన్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఆయన సీఎం పదవి కట్టబెడితే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సాయంత్రం జరిగిన సీఎల్పీ భేటీలో పంజాబ్ కొత్త సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు కట్టబెడుతూ తీర్మానం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సుఖ్‌జిందర్ రణ్‌దవాను పంజాబ్ కొత్త సీఎంగా ఎంపిక చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com