ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సాయంత్రం 5 రాష్ట్రాల ఎగ్జిట్ ఫలితాలు..

national |  Suryaa Desk  | Published : Thu, Apr 29, 2021, 12:23 PM

పశ్చిమ బెంగాల్‌లో ఆఖరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 06.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్‌తో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినట్లయింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతాయి. అన్ని ఛానెల్స్, ఏజెన్సీలు తమ సర్వేలను వెల్లడిస్తాయి. ఐతే పశ్చిమ బెంగాల్‌లో సాయంత్రం 06.30 వరకు పోలింగ్ కొనసాగుతుంది. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం విధించింది. రాత్రి 07.30 తర్వాతే ఫలితాలను ప్రకటించుకోవచ్చని తెలిపింది. ఆలోపు ఎవరు ఫలితాలు ప్రకటించినా.. మీడియాలో వార్తలు వచ్చినా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాత్రి 07.30 తర్వాత తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోం ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 27న ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరోదశ ఎన్నికలు ఏప్రిల్ 23న, ఏడో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న జరిగాయి. ఎనిమిదో దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి.


 


తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. 71.43 శాతం పోలింగ్ నమోదయింది. గెలుపుపై డీఎంకే కూటమి, అన్నాడీఎంకేక కూటమి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. ఇక 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు.73.58శాతం పోలింగ్ నమోదయింది. కేరళలో 2.74 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. అక్కడ రికార్డు స్థాయిలో 81.64 శాతం పోలింగ్ నమోదయింది.


 


ఇవాళ వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీకి అధికారం దక్కనుందో.. ఒక అంచనాకు రావొచ్చు. ఐతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐనప్పటికీ ఏ పార్టీకి ఊపుందో తెలిసిపోతుందనే అంచనాతో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com