ఇటీవలే శ్రీకాకుళం జిల్లా పలాసలో పొక్లెయిన్ లో కరోనా మృతుల శవాలను శ్మశానానికి తరలించడం తీవ్ర విమర్శలపాలవడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే తిరుపతిలో జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఓ కరోనా రోగి మృతి చెందితే అమానవీయ రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారని వెల్లడించారు. ఈ విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ట్వీట్ చేశారు. గుంతలో మృతదేహాన్ని ఉంచడానికి జేసీబీని ఉపయోగించారని ఆరోపించారు. ఈ వీడియోను మృతుడి కుటుంబీలకు చూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు. చనిపోయిన వాళ్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వరా? అంటూ నిలదీశారు. కాగా, తిరుపతిలో కరోనాతో చనిపోయింది ఓ టీటీడీ ఉద్యోగి అని, ఈ ఘటనతో టీటీడీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ప్రచారం జరుగుతోంది.