ఆస్తి కోసం ఏకంగా కన్న తల్లిని, పెంచిన తండ్రిని తన్ని తరిమేశాడు. కట్టుకున్న భార్యతో కలసి వృద్ధులైన తల్లిదండ్రుల మీద దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లికి చెందిన బామాండ్ల నర్సయ్యకు అతడి కుమారుడు, కోడలికి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఆస్తికోసం కొడుకు, కోడలు నర్సయ్య మీద దాడి చేశారు. కోడలు తన మీద చేయి చేసుకోవడంతో మామ నర్సయ్య అవమానంగా భావించాడు. తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. ఊళ్లో అందరి ముందు తలవంపులుగా అనిపించింది. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు నర్సయ్యను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తిరుపతి తెలిపారు.