ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆలయంలో అర్ధనారీశ్వరుడిగా కొలువై ఉన్న శివుడు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:37 PM

శివుడు లింగరూపంలో దర్శనం ఇచ్చే ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం శివలింగం రెండు ముఖాలను కలిగి ఉండి అర్ధనారీశ్వరుడి రూపంలో భక్తులకి దర్శనం ఇస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో మాత్రమే శివుడు అర్ధనారీశ్వరుడిగా కొలువై ఉన్నారు. మరి ఈ శివలింగం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...చిత్తూరు జిల్లా సువర్ణముఖి నది తీరాన తొట్టంబేడు మండలంలో విరుపాక్షపురం అనే గ్రామంలో అతి ప్రాచీన అర్ధనారీశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన శివలింగం రెండు రూపాలని కలిగి ఉంది. ఒకప్పుడు ఈ క్షేత్రాన్ని పాపివిచ్ఛేద క్షేత్రం అని పిలిచేవారు. ఇక్కడ వెలసిన ఈ స్వయంభూ లింగం శివుని భాగంగా భావించబడుతూ ఉన్న ఒక భాగం తెల్లగా మంచువలె ఉండగా, రెండవ సగభాగం దేవి భాగమైన పసుపు రంగుని కలిగి ఉంది.ఆలయ స్థలపురాణానికి వస్తే, ఆర్యావర్తనంలోని అవంతీనగరంలో విజయ, సుభగలు నివసిస్తుండేవారు. విజయునికి శివుడు అంటే ఎనలేని భక్తి ఉండేది. అయితే ఒకనాడు విజయుడు మార్కండేయ మహర్షిని దర్శించి అయన సలహా మేరకు దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తికి వెళ్లి ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుడిని ఎంతో భక్తితో సేవిస్తుండేవాడు. ఒకనాడు కలలో శివుడు శ్రీకాళహస్తికి ఉత్తరంగా సువర్ణముఖి నదీతీరాన దేవతలు, ఋషులు మొదలగు వారిచేత పూజలందుకుంటున్న అర్ధనారీశ్వరుని సేవించి తరించమని చెప్పగా, ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారం ఆ నదీతీరం వెంబడి వెళ్లి పాపివిచ్ఛేద క్షేత్రాన్ని చేరి భక్తితో ఆ స్వామిని కొలిచాడు. అయితే విజయుడి భార్య సుభగ కూడా ప్రతిరోజూ బంకమట్టితో 108 శివలింగాలు చేసి ఎంతో భక్తితో ఆ స్వామిని పూజించేది.వారి భక్తికి మెచ్చి శ్రావణమాసం, పూర్ణిమరోజున శ్రీకాళహస్తీశ్వరుడు దేవి సమేతంగా ఆ దంపతులకి ప్రత్యేక్షమై విజయుడు పూజిస్తున్న శివలింగం నందు సతీసమేతంగా ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటామని, ఈరోజు నుండి సుభగాంబ సమేత శ్రీ విజయేశ్వరస్వామి అని మీ దంపతుల పేరున పిలువబడుతూ భక్తుల కోర్కెలు తీర్చెదను అని చెప్పాడని స్థల పురాణం. ఇంతటి మహిమ గల ఈ ఆలయంలో యజ్ఞము, దానము, తపస్సు చేసినవారికి శ్రీ కాళహస్తీశ్వరుని సన్నిధిలో యజ్ఞ, దాన, తపః ఫలితాలతో సమానమైన ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com