ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20% టైప్ 2 డయాబెటిస్ కేసులకు వాయు కాలుష్యమే కారణం!

international |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 10:21 PM

దీర్ఘకాలం కాలుష్యంతో టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి నిర్దారించింది. వెంట్రుక కంటే 30 రెట్లు సన్నగా ఉండే పీఏం 2.5 కాలుష్య కారకాలతో కలుషితమైన గాలిని ఎక్కువ కాలం పీల్చితే టైప్ 2 మధుమేహం వచ్చే ముప్పు పెరుగుతుందని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ అధ్యయనం స్పష్టం చేసింది. 20 శాతం టైప్ 2 మధుమేహం కేసులకు.. దీర్ఘకాలిక పీఏం 2.5 కాలుష్య కారకానికి గల సంబంధాన్ని అధ్యయనం వివరించింది. పట్టణ ప్రాంతాల్లోని కాలుష్య కారకాలు చమురు, డీజిల్, బయోమాస్, గ్యాస్ మండించడం వల్ల విడుదలవుతాయి. పెరుగుతున్న కాలుష్యం.. పెద్ద సంఖ్యలో ప్రజల ఆరోగ్యాలకు ముప్పుగా మారుతుందని, భారతదేశంలో విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుందని స్టడీ పేర్కొంది.


పీఏం 2.5 స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెంచుతుందని, తద్వారా హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుందని తెలిపింది. నెలవారీగా కాలుష్యానికి గురికావడం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దారితీసిందని, దీర్ఘకాలికంగా (దాదాపు ఒక సంవత్సరం) ప్రభావితం అయితే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 20% పెంచుతుందని అధ్యయనంలో వెల్లడయ్యింది.


సామాజిక ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమూహాలు, అనారోగ్య సమస్యల ఎదుర్కొనే పురుషుల్లో వాయు కాలుష్యం, మధుమేహం మధ్య సంబంధం ఎక్కువగా ఉంటుందని తేలింది. మధుమేహ బాధితులు, లేనివారిలోనూ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో పీఏం 2.5కి సంబంధం ఉందని ఆధారాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 537 మిలియన్ల మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వారిలో సగం మందికి తమకు మధుమేహం ఉందని తెలియకపోవడం గమనార్హం.


ఇదిలా ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం భారత్‌లో 18 ఏళ్లు దాటినవారిలో 77 మిలియన్ల మంది టైప్-2 మధుమేహ బాధితులు కాగా.. దాదాపు 25 మిలియన్ల మంది ప్రీ-డయాబెటిక్ ముప్పు (భవిష్యత్తులో మధుమేహం వచ్చే సూచనలు) ఎదుర్కొంటున్నారు. ఇక, ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. బీహార్‌లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా మారుతుండగా... కాలుష్య రాజధానిగా ఢిల్లీ నిలిచింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా 2018 నుంచి నాలుగు సార్లు ఢిల్లీ నిలవడం తీవ్రతకు అద్దం పడుతుంది.


ప్రపంచ కాలుష్య దేశాల జాబితా 2023లో భారత్ మూడో స్థానంలో ఉంది. దేశంలోని గాలిలో పీఏం 2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు సగటున 54.4 మైక్రోగ్రాములు ఉన్నట్టు నివేదిక తేటతెల్లం చేసింది. భారత్ తొలి రెండు స్థానాల్లో పొరుగు ఉన్న బంగ్లాదేశ్ (క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములు), పాకిస్థాన్ (క్యూబిక్ మీటరుకు 73.7 మైక్రోగ్రాములు) నిలిచాయి. బిహార్‌లోని బెగుసరాయ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య ప్రాంతంగా మారుతోందని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 పేర్కొంది.


అంతకు ముందు ఏడాది సగటున 53.3 మైక్రోగ్రాముల సాంద్రతతో భారత్ 8వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసిన వార్షిక మార్గదర్శక స్థాయి క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా భారతదేశంలోని 1.36 బిలియన్ల మంది పీఏం 2.5 సాంద్రతలను అనుభవిస్తున్నారని నివేదిక పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com