ఒలింపిక్స్కు ముందు రష్యాకు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) రూల్స్ను అతిక్రమించినందుకు గాను రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించింది. తప్పుడు డోపింగ్ పరీక్షా ఫలితాలు, నిర్వహణతో రష్యా క్రీడా సమాఖ్య ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించుకుంది.మాస్కోలోని ల్యాబోరేటరీల్లో నామమాత్రపు పరీక్షలు, నకిలీ నివేదికలు, నిర్వహణ తీరుపై విచారించిన 'వాడా' స్వతంత్ర దర్యాప్తు కమిటీ నివేదిక ఆధారంగా వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాపై నిషేధం విధించి శిక్షించాలని వాడా కమిటీ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవమని అధికార ప్రతినిధి తెలిపారు.ఈ విషయం గురించి వాడా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘రష్యన్ జట్టుపై నాలుగేళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం. వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు న్యూట్రల్స్గా మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు వారు వాడా పరీక్షలన్నింటిలో సఫలం కావాల్సి ఉంటుంది. అదే విధంగా వారికి సంబంధించిన శాంపిల్స్ ప్రభావితం కాలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక నిషేధంపై అప్పీలు చేసుకోవడానికి 21 రోజులపాటు రష్యాకు వాడా గడువునిచ్చింది.