ప్రపంచ ఛాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సింధు 21-15, 21-16తో ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్ గా ఉన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. వరుస గేముల్లో సింధు దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు. కేవలం 36 నిమిషాల్లోనే ఆటను ముగించింది. రెండో రౌండ్లో థాయ్ల్యాండ్ అమ్మాయి బుసానన్తో సింధు తలపడనుంది. రెండు గేముల్లోనూ సింధు తన మునుపటి ఆటను ప్రదర్శించింది. మొదట 8-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పుంజుకున్న కిమ్ 11-10తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆపై 13-13తో స్కోర్లు సమమైన స్థితిలో సింధు విజృంభించి వరుసగా 6 పాయింట్లతో గేమ్ గెలిచింది. రెండో గేమ్ సైతం 5-5తో సమమైనప్పుడు సింధు చెలరేగి వరుసగా 7 పాయింట్లు సాధించి 12-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ 21-17, 21-17తో చైనాకు చెందిన హువాన్ యు జియాంగ్ను ఓడించి రెండో రౌండ్కు దూసుకెళ్లాడు. మరోవైపు సమీర్ వర్మ పరాజయం పాలయ్యాడు. 54 నిమిషాలు పోరాడి 11-21, 21-13, 8-21 తేడాతో ఓడాడు. పోటీ నుంచి టాప్ సీడ్ కెంటో నిషిమోట (జపాన్) తప్పుకోవడంతో కిడాంబి శ్రీకాంత్ నేరుగా ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాడు. తొలి రౌండ్లో 9వ సీడ్ సైనా నెహ్వాల్ 13-21, 20-22తో కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓటమిపాలయింది. కేవలం 30 నిమిషాల్లోనే సైనా గేమ్లలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. తొలి గేమ్లో చైనా క్రీడాకారిణి కాయ్ దూకుడు ప్రదర్శించడంతో ఏ దశలోనూ సైనా పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేమ్లో మాత్రం సైనా గట్టిపోటీ ఇచ్చింది. అయితే పట్టువిడవని కాయ్ చివరకు గేమ్తో పాటు మ్యాచ్ గెలుచుకుంది. గతవారం చైనా ఓపెన్లో తొలి రౌండ్లోనే సైనా ఇంటిదారి పట్టినవిషయం తెలిసిందే. అయితే సైనా చైనా ఓపెన్లోనూ కూడా కాయ్ చేతిలోనే ఓటమిని చవిచూసింది. సైనా తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఈ సీజన్లో ఇది 8వ సారి.