బెంగళూరు: కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు రేపు బీజేపీలో చేరనున్నారు. అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు రేపు సీఎం యడియూరప్ప సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అశ్వంత్ నారాయణ సీఎన్ తెలిపారు. బీజేపీలో చేరేందుకు వారు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ పార్టీ సీనియర్ నాయకులను కలిశారన్నారు. సీఎం యడియూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నలిన్ కుమార్ కతిల్ సమక్షంలో రేపు ఉదయం 10.30 గంటలను పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన అనంతరం వీరిలో పలువురు ఎమ్మెల్యేలు అశ్వంత్ నారాయణతో కలిసి బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ను ఢిల్లీలో కలిశారు.