ఏపీ హోంమంత్రిగా ఎమ్మెల్యే సుచరిత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం అమరావతిలోని సెక్రటేరియట్ రెండో బ్లాక్ లోని తన పేషీలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యత ఇచ్చారని జగన్ ను కొనియాడారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక్కరిపై చర్యలు తీసుకుంటే అందరూ భయపడేలా చేస్తామన్నారు. ర్యాగింగ్, వేధింపులను సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు. మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే పరిస్థితి కల్పిస్తామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ తీసుకొస్తామని వెల్లడించారు.