ఉక్కపోతతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపిచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు 48 గంటల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయని, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని చెప్పింది. రుతుపవనాలు తొలుత రాయలసీమలో ప్రవేశిస్తాయని, 24 గంటల్లో ఉత్తర కోస్తాకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కేరళను దాటి కర్నాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. 48 గంటల్లోగా రాయలసీమలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో రాయలసీమ, కోస్తాంధ్రల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయని.. కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని చెప్పింది. రానున్న 3,4 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో 4 రోజుల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రుతుపవనాల ప్రభావంతో జూన్ 19 నుంచి 24 వరకూ రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడొచ్చని అంటున్నారు.