అమరావతి: వెనుకబడిన ప్రాంతం నుంచి తమ్మినేని సీతారాం స్పీకర్గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపే కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమ్మినేనికి స్పీకర్ బాధ్యతలను అప్పగించడం సహేతుకమని భావిస్తున్నానన్నారు. ఈ సభను తమ్మినేని హుందాగా నడిపిస్తారని నమ్మకం ఉందన్నారు. విలువలు, విశ్వసనీయత, రాజ్యాంగ స్ఫూర్తిని పరిఢవిల్లేలా చేయాలన్నారు. 2014లో శాసనసభలో అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఆశలతో వచ్చామన్నారు. గత ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందన్నారు. గత ప్రభుత్వం శాసనసభను సరైన దారిలో నడిపించలేక పోయిందన్నారు. నన్ను ఉపముఖ్యమంత్రిని చేసి సీఎం జగన్ దేశానికే స్ఫూర్తిగా నిలిచారన్నారు.