ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటూ భారత్ను పాకిస్థాన్ బహిరంగంగా వేడుకోవాల్సి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం గుజరాత్లోని అమ్రేలీలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా భాజపా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ.. బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిన అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనపై ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్లోని రెండు, మూడు జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లపాటు బాంబు పేల్లుళ్లు చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు.
‘గుజరాత్లోని సర్దార్ పటేల్ విగ్రహం.. నెహ్రూని అగౌరవపర్చడానికి నిర్మించిన విగ్రహం కాదు. సర్దార్ పటేల్ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయి ఉంటే, ఇప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. గత ప్రభుత్వాలు గుజరాత్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టును 40 ఏళ్ల క్రితమే పూర్తి చేసి ఉంటే గుజరాత్ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉండేవి. నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా వేరే వారిని కనీసం ఐదేళ్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోగలరా? గుజరాత్లో నేను నేర్చుకున్న విషయాలు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. 2017లో డోక్లాంలో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో అవి బాగా ఉపయోగపడ్డాయి’ అని మోదీ వ్యాఖ్యానించారు. కాగా, లోక్సభ మూడోదశ ఎన్నికల్లో భాగంగా గుజరాత్లోని 26 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లోనూ గెలుపొందింది.