ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో సైలెంట్‌గా పని కానిచ్చేసిన ఇండియన్ నేవీ.. ‘దామగుండం’ శంకుస్థాపన జరిగిన మరుసటి రోజే..

national |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 11:22 PM

అక్టోబర్ 15వ తేదీన హైదరాబాద్ సమీపంలో.. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడర్ స్టేషన్‌ నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ రాడార్ స్టేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 2901 ఎకరాల అటవీ భూమిని నేవీకి కేటాయించింది. నౌకలు, జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేయడంలో ఈ రాడార్ స్టేషన్ కీలకంగా మారనుంది.


దామగుండంలో రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మరుసటి రోజే.. విశాఖపట్నం కేంద్రంగా ఇండియన్ నేవీ మరో కీలకమైన కార్యక్రమం కూడా పూర్తి చేసింది. అణుశక్తి సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరైన్‌ను ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా లాంచ్ చేసింది. ఇది మన దేశం తయారు చేసిన/చేస్తున్న నాలుగో న్యూక్లియర్ బాలిస్టికల్ మిస్సైల్ జలాంతర్గామి కావడం విశేషం. దీనికి ఎస్4* అనే కోడ్ నేమ్ పెట్టారు. అక్టోబర్ 16న దీన్ని లాంచ్ చేసినప్పటికీ.. ఇప్పటి వరకూ భారత ప్రభుత్వం ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం.


ఈ ఎస్4* జలాంతర్గామిని 75 శాతం స్వదేశీయ పరికరాలతో రూపొందించారు. 3500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తాకగల కె-4 న్యూక్లియర్ బాలిస్టిక్ మిస్సైళ్లను ఇది కలిగి ఉంటుంది. భారత్ రూపొందించిన తొలి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ 750 కి.మీ. రేంజ్ ఉన్న కె-15 అణు క్షిపణులను మోసకెళ్తుంది. దాని తర్వాత రూపొందించిన అణు జలాంతర్గాములను కె-4 శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను మోసుకెళ్లేలా తీర్చిదిద్దారు.


ఆహార పదార్థాలు అయిపోవడం, సిబ్బంది అలసిపోవడం, మెయింటెనెన్స్ లాంటి సమస్యలు తప్పితే.. ఈ అణు జలాంతర్గాముల పరిధి అపరిమితం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది ఆగస్టు 29న ఐఎన్ఎష్ అరిఘాట్‌ను లాంచ్ చేశారు. ఇది మన దేశం తయారు చేసిన రెండో అణుశక్తి సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరైన్ (ఎస్ఎస్‌బీఎన్). మొదటి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్‌తో‌పాటు ఐఎన్ఎస్ అరిఘాట్ ఇప్పటికే సముద్ర జలాల్లో గస్తీ నిర్వహిస్తోంది. మూడోదైన అణు జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిధమన్‌ను వచ్చే ఏడాది లాంచ్ చేయనున్నారు. భారత్ రష్యా నుంచి లీజ్‌కు తీసుకుంటున్న అకులా క్లాస్ జలాంతర్గామి 2028లో భారత నేవీలో చేరనుంది.


భారత్ తొలిసారిగా లీజ్‌కు తీసుకున్న అణ్వస్త్ర జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్రకు ఎస్1 అని పేరు పెట్టిన జాతీయ భద్రతా ప్రణాళిక విభాగం.. ఐఎన్ఎస్ అరిహంత్‌కు ఎస్2 అని.. అరిఘాట్‌కు ఎస్3 అని, అరిధమాన్‌కు ఎస్4 అని పేరు పెట్టింది. కొత్తగా లాంచ్ చేసిన జలాంతర్గామికి ఎస్4* అని పేరు పెట్టారు. భారత్ రూపొందించబోయే తదుపరి అణు జలాంతర్గాముల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు.


గత ఏడాది కాలంగా.. నెలకు 10-11 చొప్పున చైనా యుద్ధ నౌకలు హిందూ మహా సముద్రంలో తిరగాడుతున్నాయి. చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో అప్రమత్తమైన భారత్.. తన నౌకా దళ బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. సాగర జలాల గస్తీ కోసం జలాంతర్గాములను పెంచుకుంటోంది.


ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్లను చైనాకు చెందిన డాంగ్ ఫెంగ్-21, డాంగ్ ఫెంగ్-26 లాంటి క్షిపణులు తేలిగ్గా దెబ్బతీసే అవకాశం ఉండటంతో.. భారత్ అణ్వస్త్ర, బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరైన్లకు ప్రాధాన్యం ఇస్తోంది. డీజిల్ అటాక్ కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ వగ్షీర్‌ను ఈ ఏడాది డిసెంబర్లో లాంచ్ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com