సూపర్సిక్స్ హామీల అమలుకు ముహూర్తం ఎప్పుడని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలును కూటమి ప్రభుత్వం విస్మరించింది. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారని బొత్స మండిపడ్డారు.
రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక, మద్యం మాఫియాలు పని చేస్తున్నాయని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం సరైన కసరత్తు చేయకుండానే ఇసుక, మద్యం పాలసీలు ప్రకటించిందని, అందుకే ఆ రెండింటి అమలులో పిల్లిమొగ్గలు వేస్తోందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని ఏయే మద్యం బ్రాండ్స్ తొలగించారు?. అలాగే మద్యం ధరలు ఎంతెంత తగ్గించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అంతులేని దోపిడి, ఎమ్మెల్యేల అరాచకాలు కొనసాగుతున్నాయని, నిత్యావసరాల ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు.