డయేరియా బాధితులకు వైద్యసేవలు దారుణంగా ఉన్నాయని, స్కూళ్లలో మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తూ, బెంచీలపై రోగులకు వైద్యం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేకపోవడంతో, రోగులంతా అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని.. దీంతో ఆ ఆస్పత్రులన్నీ డయేరియా రోగులతో కిటకిటలాడుతున్నాయని విజయనగరం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను) వెల్లడించారు. డయేరియా బాధితులను తమపార్టీ నేతలు పరామర్శించిన తర్వాతే స్థానిక మంత్రి చుట్టంచూపుగా వచ్చి వెళ్లారే తప్ప, వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టలేదని ఆక్షేపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి, డయేరియా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, వ్యాధిని పూర్తిగా అరికట్టాలని చిన్నశీను డిమాండ్ చేశారు.