ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్‌లో వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు.. వైసీపీ ఎమ్మెల్సీ‌పై కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 07:23 PM

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జకియా ఖానంపై ఆరోపణలు రావడం కలకలం రేగుతోంది. ఆరు టిక్కెట్లను రూ.65 వేలకు విక్రయించారని బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం కోసం ఎమ్మెల్సీ ఖానం సిఫార్సు లేఖపై ఆరు టిక్కెట్లు పొందినట్టు భక్తుడు తెలిపాడు. ఇందుకోసం రూ.65 వేలు చెల్లించామని ఆరోపించాడు. అధిక ధరకు విక్రయించడంతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి సాయికుమార్ అనే భక్తుడు ఫిర్యాదు చేయడంతో అదికారులు విచారణకు ఆదేశించారు.


విజిలెన్స్ విచారణలో ఆరోపణలు నిర్దారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్సీ జకియా ఖానం, ఆమె పీఆర్వో కృష్ణతేజ సహా ముగ్గురిపై కేసు నమోదయ్యింది. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ, ఏ3గా ఆమె పీఏలను చేర్చారు. కాగా, ఇటీవల కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ జకియా ఖానం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె మంత్రి నారా లోకేశ్‌ను కలవడంతో టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఆదివారం ఆమె విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆమె సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు రావడం గమనార్హం.


ఈ ఆరోపణలపై జకియా ఖానం స్పందించారు. తాను విజయవాడకు బయలుదేరుతున్నట్టు తెలిసే కావాలనే వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారని ఆమె ఆరోపించారు. ఆ లేఖ ఇచ్చిన విషయం తనకు తెలియదని, పీఆర్వో కూడా వారం రోజులుగా లేరని ఆమె అన్నారు. కాగా, కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా ఖానంకు ఎమ్మెల్సీని చేయడమే కాకుండా.. మండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. మూడేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పారట్ీ పెద్దలతో బాగానే ఉన్న జకీయా ఈ మధ్య ఎందుకో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీతో చెడిందని.. వైఎస్ఆర్సీపీ ఆమె గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. జులైలో మంత్రి నారా లోకేశ్‌తో జకియా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రిని కలవడంతో టీడీపీలో చేరికపై ఊహాగానాలు మొదలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com