ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి అక్కసు వెళ్లగక్కిన కెనడా.. దౌత్యవేత్తలపై నిఘా, రష్యాతో భారత్‌కు పోలిక

international |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 11:11 PM

గతేడాది జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో దెబ్బతిన రెండు దేశాల సంబంధాలు.. రాను రాను మరింత క్షీణిస్తున్నాయి. భారత్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసిన కెనడా.. అక్కడ ఉన్న సిక్కుల ఓటు బ్యాంకు కోసం.. భారత్‌ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో.. భారత్ పట్ల అక్కసు వెళ్లగక్కుతుండగానే.. తాజాగా కెనడా విదేశాంగమంత్రి మెలానీ జోలీ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కెనడాలోని భారత రాయబారులపై నిఘా ఉంచినట్లు తెలిపిన ఆమె.. రష్యాతో భారత్‌ను పోల్చడం దుమారానికి కారణం అయింది. అంతేకాకుండా వియన్నా కన్వెన్షన్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదని మెలానీ జోలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


భారత్ కెనడా మధ్య ప్రస్తుతం దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. రష్యా, భారత్‌ మధ్య మెలానీ జోలీ పోలిక తెచ్చారు. కెనడా చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని.. అంతర్జాతీయ శక్తులు తమ దేశ గడ్డపై ఇలాంటి అణచివేతకు పాల్పడటాన్ని తాము జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. ఐరోపాలో ఇలాంటివి తాము చూశామని.. జర్మనీ, యూకే దేశాల్లో రష్యా ఇలాంటి పనిచేసిందని.. ఇలాంటివాటికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడాల్సి ఉందని మెలానీ జోలీ వెల్లడించారు.


ఇక కెనడాలోని భారత దౌత్యవేత్తలను బహిష్కరిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒట్టావా హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు తెలిపిన మెలానీ జోలీ.. భారత రాయబారులపై నిఘా ఉంచామని తెలిపారు. మిగిలిన భారత దౌత్యవేత్తలు వాంకోవర్, టొరంటోలో ఉన్నారని చెప్పారు. వియన్నా కన్వెన్షన్‌కు విరుద్ధంగా వ్యవహరించే దౌత్యవేత్తలను కెనడా సహించబోదంటూ వ్యాఖ్యలు చేశారు.


హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించిన అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును చేర్చడం ఇటీవల భారత్ కెనడాల మధ్య మరో వివాదానికి దారి తీసింది. కెనడా తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మ సహా మరికొందరు అధికారులను అక్కడి నుంచి వెనక్కి రప్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్‌ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని భారత్ బహిష్కరించింది. ప్రతిగా కెనడా కూడా ఆరుగు భారత దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేసింది.


హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ గతేడాది జస్టిన్ ట్రూడో.. కెనడా పార్లమెంటులోనే తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో రెండు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే కేవలం నిఘా సమాచారం ఆధారంగానే భారత్‌పై ఆరోపణలు చేశానని.. తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఇటీవలె కెనడా ప్రధాని అంగీకరించారు. కెనడియన్లకు సంబంధించిన సమాచారాన్ని భారత దౌత్యవేత్తలు సేకరించారని.. ఆ సమచారాన్ని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు అందజేశారని మరోసారి ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com