ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వయనాడ్‌ బరిలో ఖుష్బూ.. ప్రియాంక గాంధీకి పోటీగా బీజేపీ వ్యూహం

national |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 10:59 PM

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలె కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే వయనాడ్ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ తరఫున సీనియర్ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్‌ను నిలబెట్టారని కమలం పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


ఉపఎన్నిక కావడం, పైగా కేరళలో మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక సీటు దక్కించుకోవడం, ఆ రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ స్థానంలో నిలిపే అభ్యర్థి విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి సరైన అభ్యర్థిని బరిలోకి దించాలని కమలం పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖుష్బూ సుందర్‌ అయితే గట్టిపోటీ ఇవ్వవచ్చనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే తాను వయనాడ్ బైపోల్స్‌ బీజేపీ అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారంలో తాజాగా కుష్బూ సుందర్‌ స్పందించారు. ఏ ఎన్నికల సమయంలో అయినా ఇలాంటి వార్తలు, పుకార్లు రావడం సహజమేనని తెలిపారు. ఇది కూడా పుకారే అని ఆమె తేల్చి చెప్పారు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే తాను ప్రియాంకా గాంధీపై వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ చేయడానికి సిద్ధమేనని ఖుష్బూ సుందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ.. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత అమేథీ నుంచి ఎంపీగా కొనసాగుతుండగా.. వయనాడ్ ఎంపీగా రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి.


దీంతో వయనాడ్‌ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ పేరును ప్రకటించగా.. కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది. వయనాడ్ బరిలో సత్యన్‌ మొఖేరీ పోటీ చేస్తారని ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరఫున ఖుష్బూ పోటీలో ఉంటే.. వయనాడ్ పోరు మరింత రసవత్తరం కావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నవంబర్‌ 13వ తేదీన ఉపఎన్నిక జరగనుండగా.. నవంబర్‌ 23వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్లతోపాటే ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com