ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 10:10 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్లతో పాటుగా కొంతమంది ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్నవారిపై కూడా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొందరు అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు తేలడంతో.. వాటిని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇష్టంవచ్చినట్లుగా అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే ఫిర్యాదులు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్నివేలమంది అనర్హులు.. సదరం సర్టిఫికేట్ ద్వారా పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే అన్ని పింఛన్లను మరోసారి తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.


రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీ, కొత్త పింఛన్ల మంజూరుకు విధివిధానాల రూపొందించేందుకు 8మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ కమిటీ రెండు వారాల్లో నివేదిక ప్రభుత్వానికి అందించనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు కూడా శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు భరోసాగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండి కొత్తగా పింఛనుదారులను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి.. వీరికి జనవరి నుంచి పింఛన్ అందించనుంది ప్రభుత్వం. ఓవైపు అనర్హుల్ని ఏరివేస్తూనే.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని చెబుతోంది ప్రభుత్వం.


రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్‌ల కోసం నవంబర్ నుంచి దరఖాస్తుల్ని ప్రభుత్వం స్వీకరించనుంది. అదే నెలలో పింఛన్ల తనిఖీ కూడా చేపట్టనుంది ప్రభుత్వం.. ఒకవేళ ఎవరైనా అనర్హులు ఉంటే వెంటనే వారికి నోటీసులు జారీ చేస్తారు. ఆ పింఛన్ తొలిగించేందుకు 45 రోజుల సమయం తీసుకుని.. అర్హులకు ఎలాంటి అన్యాయం జరగకుండా నిర్ణయాలు ఉంటాయి. గ్రామసభల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి.. పింఛన్ తొలగిస్తే.. వారు ఫిర్యాదు చేయగానే (మరో అవకాశం) పరిశీలించి సరిచేస్తారు. నవంబర్‌ నుంచి దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త పింఛన్ లబ్ధిదారుల్ని ప్రభుత్వం ఎంపిక చేయాలని భావిస్తోంది.


గత ప్రభుత్వంలో కొంతమంది అర్హులకు పింఛన్లు ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి. దాదాపు 2లక్షలమందికిపైగా ఉన్నారని.. గతేడాది వీరంతా పింఛన్ కోసం దరఖాస్తులు ఇచ్చినా.. కొందరికి మంజూరు చేసి మిగిలినవారికి ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయి. మరి కూటమి ప్రభుత్వం ఈ పింఛన్ దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పాత దరఖాస్తుల్ని పరిశీలిస్తుందా.. కొత్తగా మళ్లీ దరఖాస్తులు తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద ప్రభుత్వం అర్హులకు పింఛన్లు ఇస్తూనే.. అనర్హుల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. అనర్హులుగా తేలితో వారికి పింఛన్ కట్ చేస్తారు.. అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com