ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.40 వేలు, అర్హులు వీరే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 07:02 PM

ఏపీ మహిళలకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు చెప్పింది. వారికి ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతూ.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ బిజినెస్‌లో ఉన్న మహిళలకు జీవనోపాధి మెరుగుపడేలా కొత్త కార్యక్రమం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎంఎఫ్‌ఎంఈ కార్యక్రమాన్ని మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చంద్రబాబు సర్కార్ అనుసంధానం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను.. ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.40 కోట్లు అందించనుంది.


ఇప్పటికే నిధుల విడుదలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. మరో వారం, పది రోజుల్లో ప్రభుత్వ ఖజానాలో ఆ నిధులు జమ కానున్నాయి. ఏపీలో డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉంటూ.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వ్యాపారంలో కొనసాగుతున్న మహిళలకు ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున ఈ మొత్తాన్ని లోన్లుగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్‌ రూపంలో సెర్ప్‌కు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మండల సమాఖ్యలకు జమ చేసేది. ఇలా జమ చేసిన నిధుల్ని డ్వాక్రా మహిళలకు లోన్లుగా ఇచ్చి వారి నుంచి నెల వాయిదాల్లో తిరిగి ఆ డబ్బులు వసూలు చేసి ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా అనేక మండల సమాఖ్యల్లో ఈ నిధులు లేవు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటును మండల సమాఖ్యలకు జమ చేయకుండా స్త్రీనిధి ద్వారా డ్వాక్రా మహిళలకు లోన్లు ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


టీటీడీ ఉద్యోగులు, కార్మికులపై వరాల జల్లు


ప్రస్తుతం డ్వాక్రా మహిళలు బ్యాంకు అకౌంట్ లింకేజీ ద్వారా తీసుకునే రుణానికి 9-13.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. స్త్రీనిధి సంస్థ మంజూరు చేస్తున్న రుణాలకు 11 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే పీఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ కింద ఎంపిక చేసిన మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నారు. మహిళలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు గాను.. స్త్రీనిధి సంస్థ ద్వారానే చంద్రబాబు ప్రభుత్వం రూ.40 వేల రుణాన్ని కేవలం 6 శాతం వడ్డీకే అందించనుంది. తీసుకున్న రుణాన్ని రెండేళ్ల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన వారికి మరింత ఎక్కువగా రుణాన్ని తక్కువ వడ్డీకే ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది.


ఇక ఈ ఏడాది 10 వేల మందికి రూ.40 వేల చొప్పున లోన్లు అందించాలని సెర్ప్‌ అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వ్యాపారంలో ఉన్న 6,400 మంది డ్వాక్రా సంఘాల్లోని మహిళల్ని ఇప్పటికే ఎంపిక చేశారు. మిగతా 3,600 మంది అర్హుల ఎంపిక కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com