ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 07:01 PM

గత కొన్ని రోజులుగా వంట నూనెల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం దేశంలో పండగల సీజన్ నడుస్తుండటంతో రేట్లు పెరగడంతోపాటు డిమాండ్ కూడా పెరిగింది. ఈ క్రమంలోనే వంట నూనెలు సలసల కాగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పండగల వేళ.. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఏపీ వాసులకు భారీ ఊరట కల్పించింది. పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెలను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచే రాష్ట్రంలోని అన్ని చౌక ధరల దుకాణాల్లో రేషన్‌కార్డుపై తక్కువ ధరకే వంట నూనెలు అందించనున్నట్లు వెల్లడించింది.


నేటి నుంచి నెలాఖరు వరకు రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో ఈ వంట నూనెలు అందుబాటులో ఉండనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. పామోలిన్‌ లీటరు (850 గ్రాములు) రూ.110లకు అందించనుండగా.. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఒక్కో రేషన్‌ కార్డుపై గరిష్ఠంగా 3 లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ చొప్పున ముందుగా నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు పేర్కొన్నారు.


గురువారం విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంట నూనెల సరఫరాదారులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్.. ధరల నియంత్రణపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్‌ లాంటి దేశాల నుంచి భారత్‌కు వంట నూనెల దిగుమతులు తగ్గినట్లు పేర్కొన్నారు. దీనికితోడు పన్నులు, ప్యాకేజి ఖర్చులు కూడా పెరగడంతో వంట నూనెల ధరలు పెరిగాయని వ్యాపారులు మంత్రికి వివరించారు. దీంతో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా.. రాష్ట్రం మొత్తం ఒకే ధరపై వంట నూనెలు విక్రయించాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వ్యాపారులకు సూచించారు.


ఇక అర్హులకు త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. వచ్చే కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకోనుంది. ఇక 6 వేల రేషన్‌ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో నెలవారీ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు దాటితే.. ఆ కుటుంబాలు రేషన్‌ కార్డులు పొందడానికి అనర్హులు అని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, పొరుగు సేవల ఉద్యోగుల రేషన్ కార్డులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే కుటుంబ ఆదాయ పరిమితిని పెంచాలని కొత్త ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com