ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐరాస పోస్ట్‌లపై ఇజ్రాయేల్ దాడులు. రిస్క్‌లో 600 మంది భారత సైనికులు. కేంద్రం ఆందోళన

national |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 11:08 PM

ఇజ్రాయేల్- లెబనాన్ సరిహద్దుల్లో నెలకున్న పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీరుట్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ దళాలు ఉన్న చోట ఇజ్రాయేల్‌ వైమానిక దాడులు చేస్తోంది. శాంతిపరిరక్షణ దళాల్లో భారత సైనికులు ఉండటంతో భారత్‌ స్పందించింది. ఈ సంఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారకుండా చూడటం ఎంతో ముఖ్యమని కేంద్ర విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. అయితే, ఉద్రిక్తతల వేళ ఇజ్రాయేల్‌, ఇరాన్‌తోపాటు పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయులను ప్రస్తుతం తరలించే ప్రక్రియ చేపట్టడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ కార్యాలయంపై దాడులు ఆందోళనకరమని పేర్కొంది.


‘లెబనాన్‌ సరిహద్దులో భద్రతా పరిస్థితులు క్షీణించడంపై ఆందోళనకరం.. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం... ఐరాస ప్రాంగణాలను అందరూ గౌరవించాలి.. ఐరాస శాంతి పరిరక్షకులు, ఆ సంస్థ నిర్ణయాలను గౌరవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని విదేశాంగ శాఖ శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది.


విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘‘పశ్చిమాసియాలో నెలకున్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశాం.. అక్కడ చోటుచేసుకుంటున్న హింస, పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సంబంధిత భాగస్వామ్య పక్షాలు సంయమనం పాటించాలని, పౌరులకు రక్షణ కల్పించాలని పునరుద్ఘాటించాం.. ఈ సంఘర్షణ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకూడదు. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి’ అని పేర్కొన్నారు.


యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటరిమ్‌ ఫోర్స్‌ ఇన్‌ సౌత్‌ లెబనాన్‌ శాంతిపరిరక్షణ దళాల్లో భాగంగా భారత సైన్యం కూడా అక్కడ విధులు నిర్వర్తిస్తోంది. 50 దేశాలకు చెందిన దాదాపు 10,500 మందితో కూడిన దళాలు అందులో ఉండగా.. భారత్‌కు చెందిన 900 మందితో కూడిన బెటాలియన్‌ అక్కడ విధుల్లో ఉంది. ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 5,964 మంది భారత్ సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. దశాబ్దాలుగా వివిధ దేశాల్లో 159 మంది భారత సైనికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో యూఎన్ఐఎఫ్ఐల్‌లో ఆరుగురు, యూఎన్‌డీలో ఇద్దరు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com