ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని మహిళలకు తీపికబురు.. ఉచితంగానే ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 10:46 PM

ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. మరీ ముఖ్యంగా మహిళల కోసం హామీలు కురిపించింది. ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెలా రూ.1500, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇలాంటి హామీలు ఇచ్చింది. అయితే వీటిలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళికి ప్రారంభించనుంది ఏపీ సర్కారు. అయితే వీటన్నింటి కంటే మరో ముఖ్యమైన పథకాన్ని మహిళల కోసం పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అదే అభయం ప్రాజెక్టు. త్వరలోనే అభయం ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు జరుపుతోంది.


ఏంటీ అభయం ప్రాజెక్టు అంటే.. ప్రజా రవాణా వాహనాల్లో మహిళల భద్రతకు పెద్దపీట వేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రోజువారీ అవసరాల కోసం మహిళలు బస్సులతో పాటుగా ఆటోలు, ట్యాక్సీలు, ఇతరత్రా వాహనాలను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న తరుణంలో.. ప్రజారవాణాల్లోనూ మహిళలకు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అభయం ప్రాజెక్టు పునరుద్దరణకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే తీసుకువచ్చింది. అయితే వైసీపీ పాలనలో అభయం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ తిరిగి దీనిని తీసుకురావాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన.


ఇక ఈ అభయం ప్రాజెక్టులో భాగంగా.. ప్రజా రవాణా వాహనాల్లో అంటే.. ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు వంటి వాహనాల్లో ప్రత్యేకమైన పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పరికరం మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఏదైనా ఆపద తలెత్తినా లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినా కూడా వెంటనే.. ఈ పరికరంపై ఉన్న పానిక్ బటన్ నొక్కితే మనం ఎక్కడున్నామనేదీ సమీపంలోని పోలీస్ శాఖ, రవాణాశాఖ కంట్రోల్ రూమ్‌లకు చేరిపోతుంది. ఇక వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేకమైన పరికరాలను అన్ని రాష్ట్రాల్లోని ప్రజా రవాణా వాహనాల్లో అమర్చాలని అప్పట్లోనే కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయిస్తుండగా.. మిగతా 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇక వాహనాల యజమానులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజా రవాణా వాహనాల్లో ఈ ప్రత్యేక పరికరాల ఏర్పాటుకు 266 కోట్లు ఖర్చవుతాయని గతంలో అధికారులు అంచనా వేశారు. వీటిలో రాష్ట్రం వాటా కింద రూ. 123 కోట్లు వస్తాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవటంతో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ అభయం ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించాలని భావిస్తోంది. రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేసి.. అన్ని ప్రజారవాణా వాహనాలకు త్వరలోనే ఈ ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com