ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిక్కర్ షాపు దరఖాస్తులకు ముగిసిన గడువు.. ప్రభుత్వానికి ఎన్ని కోట్లు ఆదాయమంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 10:52 PM

లిక్కర్ షాపుల లైసెన్సుల ద్వారా ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఇవాళ్టితో ముగిసింది. శుక్రవారం (అక్టోబర్ 11) రాత్రి ఏడు గంటలకు ఈ గడువు ముగియగా.. భారీగా దరఖాస్తులు వచ్చాయి. లిక్కర్ షాపుల కోసం సుమారుగా 90 వేల వరకూ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దరఖాస్తుదారుల నుంచి ఫీజుగా రూ.2 లక్షలు చొప్పున వసూలు చేశారు. దీంతో దరఖాస్తు రుసుము రూపంలో ఏపీ ప్రభుత్వ ఖజానాకు రూ.1800 కోట్లు వచ్చినట్లు సమాచారం. అయితే దరఖాస్తు చేసుకునే గడువు ముగిసినప్పటికీ.. రాత్రి వరకూ డీడీ సొమ్ము చెల్లించేందుకు అవకాశం ఉంది. డీడీలతో ఎక్సైజ్ శాఖ కార్యాలయాల వద్దకు ఏడు గంటలలోపు చేరుకున్నవారికి రాత్రి 12 గంటల వరకూ అవకాశం ఇచ్చారు. ఇక లిక్కర్ షాపు లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తు రుసుము చెల్లించే అవకాశాన్ని ఏపీ అబ్కారీశాఖ కల్పించింది. ఇక అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలోని 113 లిక్కర్ షాపులకు 5700 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.


మరోవైపు రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను ఏపీ అబ్కారీశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ దరఖాస్తు గడువు నేటితో ముగియగా.. రేపు, ఎల్లుండి అంటే.. అక్టోబర్ 12, 13వ తేదీల్లో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇక అక్టోబర్ 14న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీస్తారు. అనంతరం లాటరీలో మద్యం దుకాణాల లైసెన్సులు గెలుపొందినవారికి అక్టోబరు 15వ తేదీ నాటికి లిక్కర్ షాపులను అప్పగిస్తారు. ఇక అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. మరోవైపు లిక్కర్ షాపుల కోసం కొన్ని ప్రాంతాల్లో అనూహ్య స్పందన రాగా.. మరికొన్నిచోట్ల ఎక్కువగా దరఖాస్తులు రాలేదు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో రెండు చోట్ల ఒక్కో మద్యం షాపు కోసం 110 వరకూ దరఖాస్తులు వచ్చాయంటేనే పోటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


అయితే మరికొన్ని జిల్లాలలో మాత్రం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడటంతో దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రాలేదు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు సైతం వీటిలో జోక్యం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సీఎం చంద్రబాబు సైతం సీరియస్ అయ్యినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దరఖాస్తు గడువును రెండురోజుల పాటు పొడిగించినట్లు తెలిసింది. ఇక ఇప్పుడు గడువు పూర్తికాగా.. రూ.1800 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమెరికా, యూరోప్ దేశాల నుంచి కూడా మద్యం షాపుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఒక్క అమెరికా నుంచే 20కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com