ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు.. వైఎస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 06:57 PM

ఏపీలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు టీడీపీలో చేరారు. ఇటీవలే రాజ్యసభ ఎంపీ పదవులకు, వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు నేతలు.. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరడంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. మోపిదేవి విషయంలో ఏరోజూ తప్పుచేయలేదన్న జగన్.. ఆయన పార్టీ మారడం చాలా బాధాకరమని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మండలిని రద్దుచేయాలనే ఆలోచన వచ్చినప్పుడు.. మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు కూడా పంపించామని జగన్ అభిప్రాయపడ్డారు.


రేపల్లె నియోజకవర్గ వైసీపీ నేతలపై వైఎస్ జగన్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే మోపిదేవి వెంకటరమణ పార్టీ మార్పు వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని వైసీపీ నేతల వద్ద చెప్పుకొచ్చారు. మా నాన్న వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా తనకు కష్టాలు వచ్చాయని.. 16 నెలలు జైళ్లోపెట్టారని గుర్తు చేశారు. అయినా కూడా ప్రజలను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారన్న సంగతిని గుర్తుంచుకోవాలని వైఎస్ జగన్.. వైసీపీ నేతలకు సూచించారు. మోపిదేవి వెంకటరమణ విషయంలోనూ తానెప్పడూ తప్పుచేయలేదన్న జగన్.. ఆయన పార్టీని వీడటం బాధాకరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేపల్లె నియోజకవర్గంలో గణేష్‌కు నేతలు మద్దతుగా నిలవాలని సూచించారు. దేవుడు ఎప్పుడూ మంచివైపు ఉంటాడని.. కష్టాలు శాశ్వతం కాదని నేతల వద్ద జగన్ అభిప్రాయపడ్డారు.


మరోవైపు ఆగస్టు నెలలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ ఎంపీ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. ఆ తర్పాతి కాలంలో ఆర్. కృష్ణయ్య సైతం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి చేరింది. అయితే రాజీనామా చేసిన తర్వాత మోపిదేవి, బీద మస్తాన్‌రావు.. టీడీపీలో చేరిపోయారు. ఆర్. కృష్ణయ్య బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునే అవకాశం ఉంది. అలాగే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులకు సైతం కీలక పదవులు దక్కుతాయనే ప్రచారం నడుస్తోంది. మరి వీరి రాజకీయ భవిష్యత్తు ఏంటనేదీ చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com