ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేబినెట్ భేటీకి రాని పవన్ కళ్యాణ్.. రతన్ టాటా అంత్యక్రియలకు గైర్హాజరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 06:49 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గురువారం ఉదయం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలేవీ తీసుకోలేదు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించిన నేపథ్యంలో.. ఆయనకు ఏపీ కేబినెట్ శ్రద్ధాంజలి ఘటించింది. అనంతరం కొద్ది సేపు మౌనం పాటించిన మంత్రివర్గం.. సమావేశంలో అజెండాపై చర్చను వాయిదా వేసుకుంది. అనంతరం ముంబై వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. రతన్ టాటా పార్థివ దేహానికి అంజలి ఘటించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే ఇవాళ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించలేదు. ఏపీ కేబినెట్ భేటీకి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఇదే సమయంలో రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు ముంబై కూడా వెళ్లలేదు పవన్. దీంతో ఏమైందా అనే చర్చ మొదలైంది.


ఇటీవల జరిగిన ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా అంత్యక్రియలకు కూడా ఇద్దరు నేతలూ కలిసి వెళ్తారనే వార్తలు వచ్చాయి. అయితే మంత్రివర్గ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అయితే అనారోగ్యం కారణంగానే పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీకి రాలేకపోయినట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు సమాచారం. దీని కారణంగానే మంత్రివర్గ సమావేశానికి కూడా రాలేకపోయినట్లు తెలిసింది. అలాగే ముంబై సైతం పవన్ కళ్యాణ్ వెళ్లలేకపోయారు.


ఇక ఇటీవలే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం పవన్ కళ్యాణ్.. తిరుమలకు వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. అయితే అప్పటి కూడా పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంలోనే ఆయన తిరుపతిలో జరిగిన వారాహి సభలో పాల్గొన్నారు. డిక్లరేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం కూడా పవన్ కళ్యాణ్ జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పూలదండలు వేయడం వద్దంటూ అప్పట్లో జనసేన తమ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.


ఇక రతన్ టాటా మృతికి ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటన్న పవన్ కళ్యాణ్.. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుంచి మొదలుకొని, విమానయాన రంగం వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని కొనియాడారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారన్న పవన్ కళ్యాణ్.. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com