ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. హరియాణా, జమ్మూ కాశ్మీర్‌‌లో తలకిందులు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 10:06 PM

ఏ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్ వెల్లడైతే రిజల్ట్ మీద ఒక అభిప్రాయం వస్తుంది. ఓటర్ల అభిప్రాయాన్ని తీసుకుని పలు సర్వే సంస్థలు ముందస్తుగానే ఏ పార్టీ, కూటమి గెలుస్తాయి అనేది అంచనా వేస్తూ ఉంటాయి. అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పిన సీట్లకు కొంచెం అటు ఇటూగా తుది ఫలితాలు వస్తాయి. అయితే అన్నిసార్లూ ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పిన పార్టీలే విజయం సాధిస్తాయని చెప్పలేం. కొన్నిసార్లు అంచనాలను తలకిందులు చేస్తూ ఇతర పార్టీలు కూడా అధికారాన్ని దక్కించుకుంటూ ఉంటాయి. తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. హరియాణాలో కాంగ్రెస్ పార్టీదే స్పష్టమైన విజయం అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేయగా.. ఇక జమ్మూ కాశ్మీర్‌లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాదని, హంగ్ అసెంబ్లీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కానీ ఫైనల్ రిజల్ట్స్ మాత్రం అందుకు భిన్నంగా రావడం గమనార్హం.


హరియాణాలో అధికార మార్పు ఖాయమని.. 10ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపి.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపు అదే ట్రెండ్ కనిపించింది. కానీ ఆ తర్వాతే అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ.. మెజార్టీ స్థానాలను మించి ఆధిక్యం కనబరుస్తోంది. ముందస్తు అంచనాలతో సంబరాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఫలితాల సరళి చూసి సంబరాలను నిలిపివేసింది. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న బీజేపీ కార్యకర్తలు, నేతలు.. కమలం పార్టీ ఆధిక్యంలోకి రాగానే సంబరాలు చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు హర్యానాలో సొంతంగానే బీజేపీ 50 సీట్ల మార్కును అందుకోగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం 34 సీట్ల వద్దే ఆగిపోయింది.


 ఇక జమ్మూ కాశ్మీర్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పనిచేయలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూటమిగా పోటీ చేయగా.. బీజేపీ, పీడీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్.. జమ్మూ కాశ్మీర్‌లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాదని.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. ఇక ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకున్నా మెజార్టీ మార్కును మాత్రం అందుకోలేదని తేల్చి చెప్పాయి.


అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ కూటమి 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 26 సీట్లలో లీడ్‌లో ఉండగా.. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీకి మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేవలం 3 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉండగా.. అందులో మెహబూబా ముఫ్తీ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక ఆమె కుమార్తె, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఇల్తిజా ముఫ్తీ.. శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక రెండు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com