ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం నిధులపై ఏపీకి కేంద్రం శుభవార్త.. ఎన్నాకెన్నాళ్లకు.. ఆ బకాయిలు సహా అడ్వాన్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 09:13 PM

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం తీపి కబురు అందించింది. ప్రాజెక్ట్ కోసం రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే, ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద విడుదల చేసిందో స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. పాత బకాయిల రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు విడుదల చేసినట్టు ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.


రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ పనులను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. ముందుగా నిధులు ఖర్చుచేసి పనులు చేయిస్తే, ఆ బిల్లులు పంపించిన తర్వాత వాటిని కేంద్రం పరిశీలించి, దశల వారీగా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.30,436 కోట్లతో ప్రాజెక్టు కొత్త డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆమోదం తెలిపింది. దీంతో గతంలో ఇచ్చిన నిధులు పోనూ రూ.12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు అవకాశం కలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.7 వేల కోట్ల వరకు అవసరమని అధికారులు చెబుతున్నారు.


కాగా, పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కేంద్రం నుంచి రూ.1,615.47 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం రూ.1,615.47 కోట్ల విలువైన పనులు చేసినప్పటికీ, అందులో కాంట్రాక్టర్‌కు కేవలం రూ.800 కోట్లే చెల్లించారు. పైగా పాత డీపీఆర్‌ ప్రకారం ఆ నిధులు ఇచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రస్తుతం కొత్త డీపీఆర్‌ ఆమోదం పొందడంతో నిధులు తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లించి, బిల్లులు కూడా సమర్పించిన రూ.800 కోట్లు రీయింబర్స్‌ చేసినట్లు సమాచారం. దీంతో పాాటు రూ.2,000 కోట్లు తక్షణమే అడ్వాన్స్‌గా కావాలని కోరడంతో ఆ మొత్తాన్ని ఇచ్చి ఉంటారని పోలవరం అధికారులు భావిస్తున్నారు.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైన తర్వాత ఇంత వేగంగా కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవడం, నిధులు మంజూరుచేయడం ఇదే తొలిసారని జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తులో నిర్మించి... తొలిదశలో ఎనిమిది మండలాల పరిధిలో 172 నివాసాల్లో 38,060 మందికి పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు 12,797 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. ఇంకా 25,263 మందికి పునరావాస కల్పించాల్సి ఉంది. ఇందుకోసం 16,440 ఎకరాల భూమి సేకరించాలి. దీనికిగాను రూ. 2,435 కోట్లు అవసరం అవుతాయని అంచనా.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com