ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. రైల్వే జోన్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రూట్లో 4 లేన్ల ప్రాజెక్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 09:11 PM

సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వేళ.. ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. సోమవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ ముగిసిన తర్వాత.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టు పనులు, రైల్వేజోన్ శంకుస్థాపన విషయమై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రితో జరిగిన చర్చల విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు హామీని ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలియజేసినట్లు చంద్రబాబు తెలిపారు.


అలాగే డిసెంబరు నాటికి విశాఖపట్నం రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.73,343 కోట్ల విలువైన మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి చెప్పారని చంద్రబాబు ఎక్స్‌లో వెల్లడించారు.ఈ ప్రాజెక్టులలో హౌరా-చెన్నై నాలుగు లేన్ల ప్రాజెక్టుతో పాటుగా ఏపీలోని 73 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, మరిన్ని లోకల్ రైళ్లు కూడా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టికల్ అండ్ కమ్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి భారతీయ రైల్వేతో కలిసి పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎదురుచూస్తోందంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీ గురించి కూడా చంద్రబాబు వివరాలు వెల్లడించారు. ప్రధానితో ఫలవంతమైన చర్చలు జరిగాయని ట్వీట్ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు సవరించిన వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించానని రాసుకొచ్చారు.


ఆర్థికమైన విషయాలతో పాటుగా అమరావతి విషయంలో ప్రధాని మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు, మరోవైపు మంగళవారం కూడా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా వివిధ అంశాలపై వారితో చర్చించనున్నారు. హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా మరికొందరు మంత్రులతో భేటీ అవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com