ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో విచారణ చేపట్టిన సిట్‌ బృందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:46 PM

ఒకవైపు తిరుమల కొండమీద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ అధికారులూ, ఉద్యోగులూ ఆ పనుల్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు ఇదే సమయంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటైన సిట్‌ కూడా దూకుడు పెంచింది. సోమవారం తిరుమలలో బృందాలుగా విడిపోయి విచారణ సాగించింది. మూడో రోజు సోమవారం సిట్‌ చీఫ్‌ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీఐజీ గోపినాథ్‌జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఏఎస్పీ వెంకట్రావు, సభ్యులు తిరుమలలో ఉన్న నెయ్యి, ముడిసరకుల పరీక్షాకేంద్రాన్ని తనిఖీ చేశారు. నెయ్యి ట్యాంకర్లు ఎలా వస్తాయి? నాణ్యతను ఎలా పరీక్షిస్తారు? రికార్డులు ఎలా ఉన్నాయనే అంశాల పరిశీలనతో పాటు కొన్ని రికార్డులను తీసుకున్నారు. తర్వాత నెయ్యి నిల్వ ఉంచే కేంద్రం, నెయ్యి సరఫరా అయ్యే విధానం, బూందీ తయారీ కేంద్రం, ఆలయంలోని లడ్డూ తయారీ పోటును పరిశీలించారు.


తర్వాత టీటీడీ ఉన్నతాధికారులు, కొనుగోళ్ల విభాగం అధికారులతో సమీక్షించారు. పలువురు అధికారులు, ఆయా విభాగాల్లోని సిబ్బందితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా.. లడ్డూలకు వినియోగించే బూందీ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన సిట్‌ అధికారులు కొంతమంది పోటు కార్మికులతో మాట్లాడారు. ఈసందర్భంగా గతంలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని అప్పటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సిట్‌ బృందానికి కొందరు పోటు కార్మికులు తెలిపినట్టు సమాచారం. నెయ్యిని చూడగానే నాణ్యత ఎలా ఉందో అర్థమైపోతుందని, కానీ గతంలో వాడిన నెయ్యిలో పూర్వపు నెయ్యి నాణ్యత కనిపించలేదని పోటు కార్మికులు సిట్‌ బృందం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com