ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో లడ్డూ ప్రసాదానికి పెరిగిన డిమాండ్.. వారంలో ఎన్ని లడ్డూలు విక్రయించారో తెలుసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 10:36 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం నెయ్యి వ్యవహారంలో విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది.. అలాగే కర్ణాటక నుంచి నందిని నెయ్యిని ప్రసాదాల కోసం తెప్పిస్తోంది. అయితే ఈ వివాదం వేళ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఎలా ఉన్నాయనే ఆసక్తి అందరిలో ఉంది. లడ్డూ ప్రసాదంపై వివాదం రేగినా సరే ప్రసాదాల విక్రయాలు ఏమాత్రం తగ్గలేదు.. గత వారంలో రోజులుగా భక్తుల నుంచి లడ్డూలకు డిమాండ్ పెరిగింది.


తిరుమల లడ్డూ ప్రసదాలు గడిచిన వారంరోజుల వ్యవధిలో ఏకంగా 23 లక్షల వరకు విక్రయాలు జరిగాయి. ఈనెల 19వ తేదీన 3,59,660 లడ్డూలు.. 20న 3,17,954.. 21న 3,67,607.. 22న 3,46,640.. 23న 3,08,744.. 24న 3,02,174.. 25న 3,10,423 లడ్డూల విక్రయాలు జరిగాయి. అంటే యావరేజ్‌గా తీసుకుంటే రోజుకు కనీసం 3 లక్షలకు పైగా లడ్డూలు విక్రయించారు. వాస్తవానికి తిరుమల లడ్డూపై వివాదం రావడంతో విక్రయాలు తగ్గుతాయని భావించారు.. కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.


తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందని టీటీడీ గుర్తించింది. గతంలో ఏఆర్ డెయిరీ పంపించిన నెయ్యిలో కల్తీ చేశారని టెస్టుల్లో గుర్తించారు.. వెంటనే ఆ నెయ్యి లారీలను వెనక్కు పంపించారు. వెంటనే టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.. మళ్లీ కర్ణాటక నందిని డెయిరీ నుంచి నెయ్యిని తెప్పిస్తోంది. అప్పటి నుంచి తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెరిగిందని చెబుతున్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. అలాగే ప్రసాదాల్లో ఉపయోగించే సరుకుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. నాణ్యతలేని వాటిని వెనక్కు పంపించారు. అలాగే తిరుమలలో అన్నప్రసాదాల విషయంలో టీటీడీ జాగ్రత్తలు తీసుకోవడంతో నాణ్యత పెరిగింది.


అంతేకాదు టీటీడీ తిరుమలలో మహాశాంతి హోమం కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు.. ఈ నెల 23న తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి దగ్గర యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను నిర్వహించారు. హోమం అనంతరం టీటీడీ సంప్రోక్షణ కూడా నిర్వహించింది. ప్రధానంగా రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ చేశారు. ఈ హోమం, సంప్రోక్షణ తర్వాత భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై తమకున్న ఆందోళన, భయాలు, అపోహలను పోయినట్లే అంటున్నారు. యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమలలో పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని చెప్పారు ఈవో, ఆలయ అర్చుకులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com