ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎమ్మెల్యేపై చంద్రబాబుకు ఫిర్యాదు.. అన్నీ తెలుసన్న సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 10:32 PM

ఏపీలో ఓ టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. రోజురోజుకూ అతని మీద ఫిర్యాదులు పెరుగుతూ ఉండటం అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇక శనివారం కొంతమంది మీడియా ప్రతినిధులు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ వ్యవహారం తీసుకువచ్చారు. ఆ టీడీపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. అతనెవరో కాదు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు నుంచి వచ్చిన కొంతమంది మీడియా ప్రతినిధులు.. శనివారం సీఎం చంద్రబాబు నాయుడును కలిసి కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. తమను కించపరుస్తున్నారని, బెదిరిస్తున్నారంటూ కొన్ని సాక్ష్యాలను చంద్రబాబుకు నివేదించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో తనకు అన్నీ తెలుసని.. సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది.


 అసలు సంగతిలోకి వస్తే అమరావతి రైతుల ఉద్యమం ద్వారా కొలికపూడి శ్రీనివాసరావు వెలుగులోకి వచ్చారు. నాలుగేళ్ల పాటు రైతుల ఉద్యమం నడవటంలో ఈయన కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యారు. దీంతో టీడీపీ కూటమి తొలి జాబితాలోనే తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావుకు టికెట్ దక్కింది. మాజీ మంత్రి జవహర్ లాంటి ముఖ్యమైన నేతను కూడా కాదని కొలికపూడికి అవకాశం ఇచ్చారు. ఇక కూటమి వేవ్‌లో తిరువూరు నుంచి కొలికపూడి సులభంగా విజయం సాధించారు. పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా ఎన్నికై.. అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొలికపూడి దూకుడు ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.


ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తల్లో సత్వర న్యాయం పేరుతో ఓ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. వైసీపీ నేత ఇంటిని కూల్చేయడం.. దీనిపై కేసులు కూడా నమోదుకావటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే దూకుడు వద్దంటూ కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు మందలించినట్లు సమాచారం. అయితే.. ఇటీవల ఓ టీడీపీ నేత కొలికపూడి మీద తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొలికపూడి వేధిస్తున్నారంటూ చిట్టెల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీడియా ప్రతినిధులు కూడా కొలికిపూడి బెదిరిస్తున్నారంటూ చంద్రబాబుకే నేరుగా ఫిర్యాదు చేశారు.


దీంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసిన సమయంలో అంతా తనకు తెలుసంటూ చంద్రబాబు వ్యాఖ్యానించటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే తిరువూరులో ఇప్పటికే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు సమాచారం. ఐవీఆర్ఎస్ ద్వారా పార్టీ శ్రేణుల నుంచి ఎమ్మెల్యేగా కొలికపూడి పనితీరు గురించి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com