ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెజ్బొల్లా ఆయుధ డిపోలకు దూరంగా పారిపోండి.. లెబనాన్ పౌరులకు ఇజ్రాయేల్ హెచ్చరిక

international |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 12:22 AM

లెబనాన్‌లో గతవారం పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో పశ్చిమాసియాలో పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం దాడుల కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్ పౌరులకు ఇజ్రాయేల్ హెచ్చరికలు చేశారు. ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులకు సూచించాయి. ఈ ఏడాదికాలంలో ఈ తరహా హెచ్చరిక రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా మరిన్ని వైమానిక దాడులు చేస్తామని, ఉగ్రవాదుల ఆయుద డిపోలకు దూరంగా ఉండాలని ఈ మేరకు ఇజ్రాయేల్ సైనిక అధికార ప్రతినిధి అవిచే ఆడ్రే హెచ్చరించారు.


 దక్షిణ లెబనాన్‌లో ప్రజల మొబైల్ ఫోన్లకు హెచ్చరికలు సందేశాలు వస్తున్నట్టు రాయిటర్స్ నివేదించింది. హెజ్బొల్లా స్థావరాలకు కనీసం 1000 మీటర్ల దూరంలో ఉండాలని ఫోన్ కాల్స్ కూడా వస్తున్నట్టు తెలిపింది. లెబనాన్ సమాచార మంత్రి జియాద్ మకేరే వీటిని ధ్రువీకరించారు. తమ మంత్రిత్వ శాఖకు ఇటువంటి సందేశాలు వచ్చాయి కానీ, ఇది మానసిక యుద్ధంలో భాగమని కొట్టిపారేశారు.


దక్షిణ లెబనాన్, బేకా లోయతో పాటు సిరియా సమీపంలోని ఉత్తర ప్రాంతాల్లోనూ ఇజ్రాయేల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయేల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ మాట్లాడుతూ.. ‘ఉత్తర ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లకు సురక్షితంగా చేరుకునే వరకూ మా ఆపరేషన్ కొనసాగుతుంది.. లెబనాన్‌పై భీకర దాడులు చేస్తాం.. ఇజ్రాయేల్ ప్రజలు సంయమనంతో ఉండవలసిన సమయం ఇది’ అని ఆయన అన్నారు. దీనికి ఇజ్రాయేల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి టెలివిజన్ ప్రసంగంలో హెచ్చరికలను పునరుద్ఘాటించారు. లెబనాన్ అంతటా వివిధ వేదికల్లో అరబిక్‌లో దీనిని విస్తృతంగా ప్రసారం చేస్తున్నట్టు మీడియా పేర్కొంది. గత వారం రోజులుగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.


ఇక, ఇజ్రాయేల్ దాడులకు ప్రతీకారంగా ఆ దేశ ఉత్తర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా దాదాపు 150 రాకెట్లు, క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. అలాగే, పేజర్లు పేలుళ్ల వెనక ఇజ్రాయేల్‌ ప్లాన్‌ లీక్‌ భయం కూడా దాగి ఉన్నట్లు ముమ్మర ప్రచారం జరుగుతోంది. కానీ, ఇజ్రాయేల్‌ మాత్రం ఆపరేషన్‌ టైమింగ్‌ను జాగ్రత్తగా ఎంచుకొన్నట్లు ఓ పత్రిక కీలక కథనాన్ని ప్రచురించింది. హెజ్బొల్లా పేజర్లలో ఏదో తేడా ఉన్నట్లు గుర్తించడంతో.. తమ ప్లాన్‌ విఫలం కాకూడదని పేల్చివేతలకు పాల్పడినట్లు పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేశాయి. కానీ, యుద్ధాన్ని లెబనాన్‌ సరిహద్దుల్లోకి తీసుకొచ్చే చర్యల్లో ఇది కీలకమైందని ఇజ్రాయేల్ పత్రిక జెరూసలెం పోస్ట్ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com