ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారందరి అకౌంట్‌లలోకి ఈ నెల 25న డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 10:15 PM

ఏపీలో వర్షాలు, వరదతో నష్టపోయిన ప్రజలు, రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న పరిహారాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే విజయవాడలో వర్షాలు, వరదలతో నష్టపోయిన వారి పరిహారానికి సంబంధించి గణను పూర్తి చేశారు. ఈ మేరకు అర్హుల జాబితాను 32 వార్డుల్లోని సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నట్లు విజయవాడ కమిషనర్ తెలిపారు. ఒకవేళ ఎవరికైనా జాబితాలపై అభ్యంతరాలు ఉంటే వెంటనే స్పెషల్ ఆఫీసర్, జిల్లా అధికారికి తెలియజేయాలని సూచించారు. సచివాలయాల్లో అర్హుల జాబితాలను ఇప్పటికే ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ సచివాలయాల పరిధిలోనే వార్డు ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇవాళ సాయంత్రానికి తుది జాబితాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.


సచివాలయాల్లో అర్హుల జాబితాలను అందుబాటులోకి తేవడంతో.. బాధితులు వెళ్లి వారి పేర్లు ఉన్నాయో, లేవో చూసుకుంటున్నారు. కొంతమంది తమ పేర్లు కనిపించడం లేదని అధికారుల్ని కలిశారు. అయితే ఆయా సచివాలయాల పరిధిలో మ్యాపింగ్ అయిన పేర్లను మాత్రం యాప్‌లో నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఆ సమాచారం ప్రకారం యాప్‌లో పేర్లు నమోదు చేశారని బాధితులు చెబుతుననారు. అధికారులు మాత్రం తాము అందరి వివరాలను నమోదు చేశామంటున్నారు. అయితే పేర్లు లేని వాళ్ల మరోసారి నమోదు చేసుకునే అవకాశం కల్పించడంతో.. ఆయా డివిజన్‌ పరిధిలోని సచివాలయాల అడ్మిన్లను కలిసి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని మిగిలిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇలాగే సచివాలయాల్లో అర్హుల పేర్లను అందుబాటులో ఉంచారు.. అక్కడ కూడా బాధితులు వారి పేర్లు ఉన్నాయో, లేదో అధికారులు సూచించారు.


వరద బాధితులకు సాయంపై చంద్రబాబు స్వయంగా ప్రకటన చేశారు. నష్టపోయినవారికి ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది క్లారిటీ ఇచ్చేశారు. ఆ పరిహారాన్ని ఈ నెల 25న అందరికీ ఒకేసారి అందజేయనున్న సంగతి తెలిసిందే. అర్హులైనా సరే.. తమకు సాయం అందలేదని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకూడదన్నారు. ఈ వరదల్లో 10 వేల వరకు వాహనాలు దెబ్బ తిన్నాయని.. ఇప్పటి వరకు 6 వేలకు బీమా చెల్లించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన వాహనాలకు కూడా త్వరగా అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.


మరోవైపు వర్షాలు, వరదల కారణంగా మునిగిన ఇళ్లకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వారికి రూ.25వేలు ఇస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అదే మొదటి, ఆపై అంతస్తుల్లోని వారికి రూ.10వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులకూ ఈ నెల 25న పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులకు పరిహారం అందజేయనున్నారు. వరద నీటిలో మునిగిన బైకులకు రూ. 3 వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ. 10 వేలు ప్రకటించారు. ఒకవేళ ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందజేయనున్నారు.


చిరు వ్యాపారులకు రూ.25 వేలు.. రూ.40 లక్షల నుంచి కోటిన్నర టర్నోవర్‌ ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష.. కోటిన్నర టర్నోవర్‌ దాటిన ఎంఎస్‌ఎంఈలకు రూ.లక్షన్నర పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. వరదలతో నష్టపోయి చేనేత కార్మికులకు రూ.15 వేలు ఆర్థికసాయం ప్రకటించారు. అదే మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు రూ. 25 వేలు.. ఫిషింగ్‌ బోట్లకు నెట్‌ దెబ్బతిని పాక్షిక ధ్వంసమైతే రూ.9 వేలు, పూర్తిగా ధ్వంసమైతే రూ.20 వేలు ప్రకటించారు. నెట్‌ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైన మోటార్‌ బోట్లకు రూ.25 వేలు..హెక్టార్‌ ఫిషింగ్‌ ఫామ్‌ డీసిల్టేషన్‌, రెస్టిరేషన్‌కు రూ.15 వేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా పంటను బట్టి పరిహారం ప్రకటించారు.. పశువులకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు సాయం ప్రకటించారు. దూడలకు రూ.25 వేలు, గొర్రెలకు రూ.7500, కోళ్లకు రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5 వేలు సాయం అందిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com