ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ బాటలో జనసేన ఎమ్మెల్యే ప్రాయశ్చిత్త దీక్ష.. తప్పైపోయిందంటున్న నానాజీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 10:18 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ అపవిత్రమైందన్న వార్తల మధ్య.. మొదట్లోనే తప్పును గుర్తించలేకపోయాను క్షమించు స్వామీ అంటూ పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యా్ణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని జనసేన ఎమ్మెల్యే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. అది మరెవరో కాదు గత రెండు రోజులుగా మీడియాలో కనిపిస్తున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వద్ద ఓ డాక్టర్‌ను పంతం నానాజీ బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావును పంతం నానాజీ దుర్భాషలాడటంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం దీనిపై మండిపడినట్లు తెలిసింది.


 ఈ నేపథ్యంలో తప్పును తెలుసుకున్నానంటూ పంతం నానాజీ.. డాక్టర్ ఉమామహేశ్వరరావుకు క్షమాపణలు కూడా కోరారు. ఉద్రేకంలో జరిగిపోయిందని.. వైద్యులకు క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించారు. అయితే పంతం నానాజీ క్షమాపణలు చెప్పినప్పటికీ దీనిపై కేసు పెట్టాలని వైద్యులు భావిస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇక ఆయన స్ఫూర్తితో తాను కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటించారు. ఎవరో చేసిన తప్పునకు తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారన్న నానాజీ.. తన తప్పునకు తానే పశ్చాత్తాపపడుతూ ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు తెలిపారు.


సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ తన నివాసం వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు పంతం నానాజీ ప్రకటించారు. డాక్టర్‌కు ఇప్పటికే క్షమాపణలు చెప్పానన్న పంతం నానాజీ.. తాను తిట్టిన విషయం అందరికీ తెలిసినప్పుడు.. తాను క్షమాపణలు కోరి, పశ్చాత్తాపపడుతున్న విషయం కూడా అందరికీ తెలియాలని అన్నారు. అందుకే తన తప్పును తెలుసుకుని పరిహారంగా సోమవారం ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్యే దౌర్జన్యం విషయమై కేసు పెడతామని డాక్టర్ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com