ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తం కక్కుకుని చస్తారు.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 07:00 PM

తిరుపతి లడ్డూ వివాదం గురించి టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయంటూ ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో ఈ ఘోరం జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది హిందువులు దీని వెనుక ఉన్న నిజానిజాలు వెలికి తీయాలని.. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి రియాక్టయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.


తిరుమల వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీని శాశ్వతంగా కనుమరుగు చేయడానికి, వైఎస్ జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారంటూ ఆరోపించారు. ఈ అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న భూమన కరుణాకర్ రెడ్డి.. సీబీఐ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. లడ్డూ విషయంలో తప్పు చేసిన వారు ఎవరైనా రక్తం కక్కుకుని చస్తారంటూ భూమన సంచలన వ్యాఖ్యలు చేశారు. కలుషితమైంది నెయ్యి కాదని.. చంద్రబాబంటూ ఆరోపించారు.


నెయ్యి కల్తీ జరిగినట్లు ఎన్‌డీడీబీ నివేదికలు చెప్తున్న సంగతిపైనా భూమన స్పందించారు. ఎన్‌డీడీబీ నివేదిక గురించి మాట్లాడాల్సి వస్తే టీటీడీ ఈవో వెల్లడించాలి కానీ.. సీఎం మాట్లాడటం ఏమిటంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు 2014-2019 మధ్య కాలంలో టీటీడీలో నందిని నెయ్యి ఎందుకు వాడలేదని కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. తమ హయాంలో టీటీడీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న భూమన కరుణాకర్ రెడ్డి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యిని సరఫరా చేసినవారే.. వైసీపీ పాలనలోనూ టీటీడీకి నెయ్యి సరఫరా చేశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయంలో టీటీడీ నెయ్యి నాణ్యత కమిటీలో సభ్యులుగా .. ప్రస్తుతం టీడీపీలో ఉన్న పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ఉన్న విషయాన్ని భూమన గుర్తు చేశారు. వివాదంపై దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని భూమన డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com