ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద కుటుంబాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 06:57 PM

తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ఘ రాజకీయ జీవితంలో వరుస ఓటములతోనూ కుంగిపోక, నిలబడి, తలబడి గెలిచిన వ్యక్తి ఆయన. ఇక ఆయన వాగ్ధాటి గురించి కూడా అందరికీ తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు సోమిరెడ్డి. అయినా కూడా కుంగిపోలేదు. అధినేత చంద్రబాబు నాయుడు ఆరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. మాజీ మంత్రి, బలమైన ప్రత్యర్థి అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద విజయం సాధించిన సంగతి తెలిసిందే.


అయితే రెండు దశాబ్ధాల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాలనలోనూ తన మార్కు చూపిస్తున్నారు. ఇక ఇటీవల ఆయన రోడ్డుపై వెళ్తున్న సమయంలో చిత్తు కాగితాలు ఏరుకునే కుటుంబం ఆయనకు కనిపించింది. ఇక వెంటనే కారు ఆపాలని డ్రైవర్‌కు సూచించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఆ తర్వాత ఆ కుటుంబం దగ్గరకు వెళ్లారు. చిన్న పిల్లలతో కలిసి కుటుంబం మొత్తం చిత్తు కాగితాలు ఏరుకుంటున్న పరిస్థితి చూసి చలించిపోయారు. చిన్నారులకు చాకెట్లు, బిస్కట్లు అందించారు. అలాగే జేబులో ఉన్న నగదు తీసి.. అక్కడికక్కడే వారికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సోమిరెడ్డి.. పిల్లలను బడికి పంపిస్తున్నారా లేదా అంటూ కన్నవాళ్లను వాకబు చేశారు. చిన్నారులకు స్కూలు పంపకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.


ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు సోమిరెడ్డి. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లోనూ.. కొన్ని నిరుపేద కుటుంబాలు ఇలా దీనస్థితిలో ఉండటం బాధాకరమని అన్నారు. అందరిలా ఆనందంగా గడపాల్సిన ఈ చిన్నారులు.. తల్లిదండ్రులతో కలిసి చిత్తు కాగితాలు ఏరుకోవడానికి వెళుతుండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యతను పాలకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు సామాన్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి 14 వేల ఓట్ల మెజారిటీతో కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com