ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పన్న ఆలయం లడ్డూ ప్రసాదంపై గంటా కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 09:55 PM

తిరుపతి లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. మిగతా దేవస్థానాల్లోని ప్రసాదాల నాణ్యతపైనా చర్చ మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లాంటి బలమైన వ్యవస్థ ఉన్న చోట ప్రసాదాల్లో కల్తీ జరిగిందన్న వార్తలతో భక్తులలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవం సింహాచలం అప్పన్న ఆలయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేస్తు్న్న లడ్డూ తయారీని పరిశీలించారు. లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్న ముడి సరుకుల నాణ్యతను పరీక్షించారు. అయితే లడ్డూలో నెయ్యి వాసన లేకపోవటంపైన గంటా శ్రీనిసవాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సింహాచలం లడ్డూ ప్రసాదం ఎండిపోయి.. లడ్డూ అనే భావన కనిపించడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


సింహాచలం ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా సింహాచలం ఆలయ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రసాదం ఎండిపోయి.. లడ్డూ అనే భావన లేదని అన్నారు. అలాగే గతంలో విశాఖ డెయిరీ నుంచి సింహాచలం అప్పన్న ఆలయానికి నెయ్యి సరఫరా చేసేవారన్న గంటా శ్రీనివాసరావు.. కిలో నెయ్యి రూ.591కి కొనుగోలు చేసేవారన్నారు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కిలో నెయ్యి 591 రూపాయల నుంచి రూ.391కి తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ విధానాల ఫలితమే ఇదంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న కిలో ఆవు నెయ్యి 685 రూపాయలుగా ఉందన్న గంటా శ్రీనివాసరావు.. యూపీలో ఉన్న సంస్థ రూ.391లకే నెయ్యి సరఫరా చేస్తోందంటే ఎలా నమ్మగలమని మండిపడ్డారు.


మరోవైపు తిరుపతి లడ్డూ వివాదంపైనా గంటా శ్రీనివాసరావు స్పందించారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి ఏం శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ నేతలు తిరిగి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం హాస్యాస్పదమంటూ విమర్శించారు. దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న గంటా శ్రీనివాసరావు.. ఆలయాల్లోని ప్రసాదాల్లో నాణ్యతను పెంచేలా ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com