ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 08:40 PM

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మీద కేసు నమోదైంది. తోట చంద్రశేఖర్ తనను మోసం చేశారంటూ వాకాడ తిరుమలరావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. తోట చంద్రశేఖర్ తనను రూ.29 కోట్ల మేర మోసం చేశారంటూ వాకాడా తిరుమలరావు అనే వ్యక్తి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిత్య కంపెనీ తనను మోసం చేసిందని అందులో ఆరోపించారు. దీంతో ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై సీసీఎస్‌లో కేసు నమోదైంది.


ఆదిత్య, తిరుమల కన్‌స్ట్రక్షన్స్ మధ్య గతంలో ఒప్పందం జరిగినట్లు తిరుమలరావు చెప్తున్నారు. 220 ప్లాట్స్ డెవలప్ చేసి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే ఇందుకోసం రూ.50 కోట్ల వరకూ సొంత పెట్టుబడి కూడా పెట్టినట్లు తిరుమలరావు చెప్తున్నారు. అయితే బిల్లులు ఇవ్వమని అడిగితే బౌన్సర్లతో దాడి చేయించారంటూ తోట చంద్రశేఖర్ మీద వాకాడ తిరుమలరావు ఫిర్యాదు చేశారు. తిరుమలరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. ఆరుగురిని నిందితులుగా చేర్చారు. ఏ3గా తోట చంద్రశేఖర్‌ను పేర్కొన్నారు.


మరోవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లో ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీని విస్తరించే ప్రయత్నం చేశారు. ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించారు. అలాగే రావెల కిషోర్ బాబు వంటి నేతలు సైతం ఏపీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సైతం ప్రారంభించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంతో.. పరిస్థితి తలకిందులైంది. జాతీయ రాజకీయాలను కేసీఆర్ పూర్తిగా పక్కనపెట్టేశారు. సొంతింటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. దీంతో ఏపీ బీఆర్ఎస్ నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.


ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. కొంతమంది నేతలు బీఆర్ఎస్ తరుఫున పోటీచేయాలని భావించినా గులాబీ బాస్ ఏపీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో రావెల కిషోర్ బాబు వంటి పలువురు నేతలు ఎన్నికల సమయంలోనూ, ఫలితాల వెల్లడి తర్పాత పార్టీలు మారిపోయారు. తోట చంద్రశేఖర్ సైతం రాజకీయంగా మౌనంగా ఉండిపోయారు. ఇప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ సమయంలోనే ఆయనపై కేసు నమోదు కావడం ఇబ్బందులకు గురిచేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com