ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారాలింపిక్స్‌లో ఆర్చర్ శీతల్ దేవి అద్భుతం.. కాలు, భుజంతోనే వరల్డ్ రికార్డ్

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 09:52 PM

మొన్నే పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. 19 రోజులుగా సాగిన విశ్వ క్రీడల్లో భారత్ 6 పతకాలతో 71వ స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సహా 7 పతకాలు వచ్చినా.. ఈసారి స్వర్ణం రాలేదు. ఒక రజతం, 6 కాంస్యాలు వచ్చాయి. అయితే కొద్దిరోజుల్లోనే ప్రారంభమైన పారిస్ పారాలింపిక్స్‌లో మనకు మంచి చరిత్రే ఉంది. అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతున్నారు పారా అథ్లెట్లు. వైకల్యం ఉన్నా మొక్కవోని ధైర్యంతో శక్తినంతా కూడదీసుకొని పతకాలు కొల్లగొడుతున్నారు. ఒకేరోజు భారత్ 4 పతకాలు సాధించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆర్చర్ శీతల్ దేవి పేరు మారుమోగుతోంది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్.. ర్యాంకింగ్ రౌండ్లో అత్యద్భుత ప్రదర్శన చేసి.. సెన్సేషనల్‌గా మారింది. రెండో స్థానంలో నిలిచి ప్రీ క్వార్టర్స్ చేరింది. ఆమెకు అదే అత్యుత్తమ ప్రదర్శన. ఈమెలో ప్రత్యేకత ఏంటంటే.. రెండు చేతులు లేకపోయినా గురిచూసి బాణాన్ని లక్ష్యానికి గురిపెట్టగలదు.


తొలిసారే పారాలింపిక్స్ బరిలోకి దిగిన 17 ఏళ్ల శీతల్ దేవి.. అదిరిపోయే ప్రదర్శన చేసింది. మొత్తం 720 పాయింట్లకుగానూ.. 703 స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. దీంతో నేరుగా ప్రీక్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. పుట్టుకతోనే రెండు చేతులు లేకున్నా.. కాలితోనే విల్లును పట్టి.. భుజంతో తాడును లాగి బాణం విసిరే ప్రత్యేకత ఈమెకు ఉంది. ఈ పారాలింపిక్స్ మహిళల ఆర్చరీ విభాగంలో.. రెండు చేతులు లేని ఏకైక ఆర్చర్ ఆమెనే కావడం గమనార్హం.


ఈ 703 స్కోరులో ఈ కశ్మీరీ ఆర్చర్ ఏకంగా 59 సార్లు 10 పాయింట్స్ సాధించింది. ఇక 24 సార్లు (X) అంటే సర్కిల్‌కు దగ్గరగా టార్గెట్ గురిపెట్టింది. తుర్కియేకు చెందిన గిర్డి ఒజ్నుర్ ఒక పాయింట్ ఎక్కువ అంటే 704 సాధించి.. వరల్డ్ రికార్డు సృష్టించింది. మొదటి 4 స్థానాల్లో నిలిచిన ఆర్చర్స్ నేరుగా ప్రీక్వార్టర్స్‌ చేరతారు. ఆగస్ట్ 31న రాత్రి 8 గంటల తర్వాత ప్రిక్వార్టర్స్‌లో శీతల్.. చిలీకి చెందిన మరియానా జునిగాతో తలపడనుంది. మరోవైపు మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ విభాగంలో.. ఆర్.కుమార్‌తో కలిసి ఏకంగా 1399 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది వరల్డ్ రికార్డు కూడా. ఇక్కడ సెప్టెంబర్ 2న నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనున్నారు.


జమ్ముకశ్మీర్ కిష్త్వార్‌కు చెందిన శీతల్ ఫొకోమెలియా అనే అరుదైన రుగ్మతతో జన్మించారు. ఈ కారణంతోనే ఆమెకు రెండు చేతులు రాలేదు (అభివృద్ధి చెందలేదు). ఆర్చరీలే చేతులే అత్యంత కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. అందరూ చేతులతోనే బాణం వదులుతుంటే.. శీతల్ మాత్రం తన కాలిని ఎంచుకుంది. కుడి కాలుతో విల్లు పైకెత్తి.. తన భుజం ఆధారంగా తీగను వెనక్కి లాగి.. దవడ సాయంతో బాణం వదులుతుంది.


శీతల్ 15 ఏళ్ల వయసు వరకు విల్లు, బాణం పట్టలేదంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. పుట్టుకతోనే రెండు చేతులు లేని ఆమె.. 2022లో తెలిసిన వ్యక్తి సూచనతో ఇంటికి 200 కి.మీ. దూరంలో ఉన్న కత్రాలోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళ్లింది. అది ఆమె జీవితాన్నే మార్చేసింది. అక్కడ పరిచయమైన కోచ్‌లు కుల్దీప్ వెద్వాన్, అభిలాష చౌదరి శీతల్‌కు ఆర్చరీ నేర్పించారు. ఆమె కాళ్లు, శరీర పైభాగం బలాన్ని కనిపెట్టి.. విజయవంతం అయ్యారు. స్నేహితులతో కలిసి రాయడం సహా చెట్లను ఎక్కేందుకు పాదాలపైనే బలాన్ని పెట్టడం వల్ల ఆమెలో అంత శక్తి వచ్చిందని చెబుతుంటారు.


ప్రస్తుతం మహిళల కాంపౌండ్ ఓపెన్ విభాగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది శీతల్. గతేడాది జరిగిన పారా ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు సహా ఒక రజతం గెల్చుకుంది. ఇప్పుడు పారా ఒలింపిక్స్‌లోనూ గోల్డ్ లక్ష్యంగా పెట్టుకుంది. మరో విశేషం ఏంటంటే.. రెండేళ్ల కిందట విలువిద్య కోసం బయల్దేరిన ఆమె ఇప్పటివరకు ఇంటికి తిరిగివెళ్లలేదు. పారాలింపిక్స్ పతకంతోనే ఇంటికి వెళ్లాలనుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com